ఎంపీల నిర్లక్ష్యానికి భారీ మూల్యం... బయటపెట్టిన రాజ్యసభ సెక్రటేరియట్...
వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ చార్జీలను కార్మికులే భరించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసలే లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులపై టికెట్ చార్జీల భారాన్ని మోపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు ఇలాంటి పరిస్థితి నెలకొంటే... మరోవైపు తాజాగా రాజ్యసభ ఎంపీల రైలు టికెట్ల కోసం కేంద్రం రూ.8కోట్లు రైల్వే శాఖకు చెల్లించింది. అంతేకాదు,ఇందులో చాలామంది ఎంపీలు ఒకేసారి పలు రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలింది.
పార్లమెంటరీ బులెటిన్లో వెల్లడి..
పార్లమెంటరీ బులెటిన్లో రాజ్యసభ జనరల్ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఈ విషయాలను బయటపెట్టారు. 'ఒకేరోజు ఒకే స్టేషన్ లేదా ఇతర స్టేషన్ల నుంచి ఒకే గమ్యానికి వివిధ రైళ్లలో కొంతమంది రాజ్యసభ సభ్యులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా నిరుపయోగమయ్యే బుకింగ్స్కు కూడా రాజ్యసభ సెక్రటేరియట్ రైల్వేకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రాజ్యసభ బడ్జెట్పై భారం పడుతోంది.' అని దీపక్ వర్మ పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులోనూ ఎంపీలు ఇలాగే వ్యవహరిస్తే వారి వేతనాల నుంచే రైల్వే టికెట్ చార్జీలను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఒకేసారి ఒకే గమ్య స్థానానికి వివిధ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవడం సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలిగిస్తుందన్నారు.
ఎంపీల నిర్లక్ష్య వైఖరిపై వెంకయ్య అసంతృప్తి
రాజ్యసభ ఎంపీలు ఒకేరోజు ఒకే గమ్య స్థానానికి వివిధ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారని.. చివరకు ఏదో ఒక రైల్లో ప్రయాణిస్తున్నారని.. కనీసం బుకింగ్స్ను క్యాన్సిల్ కూడా చేసుకోవట్లేదని రైల్వే శాఖ రాజ్యసభ సెక్రటేరియట్కు తెలిపింది.ఒక్క 2019 సంవత్సరానికే రాజ్యసభ సెక్రటేరియట్.. ఎంపీల రైల్వే టికెట్ల కోసం రూ.8కోట్లు చెల్లించింది. గతంలో అయిన వ్యయంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. ఎంపీల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాజ్యసభ బడ్జెట్పై భారం పడుతుండటంతో దీనిపై ఒక ప్రకటన చేయక తప్పలేదు. ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైల్వే అధికారులు ఏమంటున్నారు..
సీనియర్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎంపీలకు ఉచితంగా ఇచ్చే రైల్వే టికెట్లు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. మరో అధికారి మాట్లాడుతూ.. ఎంపీల వ్యవహార శైలి రైల్వేలో అవినీతికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఒక ఎంపీ వేర్వేరు స్టేషన్ల నుంచి వివిధ రైళ్లలో బెర్తులు బుక్ చేసి.. అందులో ప్రయాణించకపోతే... రైల్వే సిబ్బందికి అది అక్రమ సంపాదనగా మారే అవకాశం ఉందన్నారు. అయితే కొన్నిసార్లు ఎంపీలు తాము ఉపయోగించుకోలేని బుకింగ్స్కు తమవాళ్లను పంపిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Recommended Video
చట్టం ఏం చెబుతోంది..
సెక్షన్6(1),6B(1) వేతనం,అలవెన్సు,పార్లమెంట్ సభ్యుల పెన్షన్ యాక్ట్ 1954 ప్రకారం ఎంపీలకు ఉచిత రైల్వే ప్రయాణం కల్పించబడింది. దాని ప్రకారం ఒక ఎంపీ తనకు నచ్చిన రైల్లో ఏసీ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించవచ్చు. ఎంపీతో పాటు వారి భార్య లేదా భర్తకు కూడా ఈ అవకాశం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో వీరు బుక్ చేసుకునే టికెట్లు నిరుపయోగమవుతున్నాయని.. తద్వారా నిధుల దుర్వినియోగం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.