టైం ఉంది!: రాజ్యసభలో సచిన్, రేఖలు టార్గెట్, వివరణ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటి రేఖలు రాజ్యసభకు గైర్హాజరు కావడాన్ని సభలోనే పలువురు పార్లమెంటు సభ్యులు లేవనెత్తారు. రాజ్యసభకు సచిన్ మూడు రోజులు, రేఖ ఏడు రోజులు మాత్రమే హాజరయ్యారు. దీనిని సీపీఎం నేత పీ రాజీవ్ ప్రశ్నించారు.
పి రాజీవ్ మాట్లాడుతూ... సచిన్ కేవలం రాజ్యసభకు మూడు రోజులు మాత్రమే హాజరయ్యారని, రేఖ ఏడు రోజులే వచ్చారన్నారు. సచిన్, రేఖలు రాజ్యసభకు రాక పోవడంపై అనుమతి కోరినట్లుగా ఉందా అని ప్రశ్నించారు.
దీనిపై డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సమాధానమిస్తూ... ఆర్టికల్ 104 ప్రకారం ఒక రాజ్యసభ సభ్యుడు అరవై రోజుల పాటు సభకు హాజరుకాకుంటే అతని సీటు ఖాళీగా ఉందని ప్రకటించవచ్చునని, సచిన్, రేఖలు నలభై రోజుల కంటే తక్కువగా హాజరయ్యారు కాబట్టి, వారిద్దరూ రాజ్యాంగంలోని ఆ నిబంధనను ఉల్లంఘించలేదని, ఇప్పుడే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కురియన్ మాట్లాడుతూ.. సచిన్ ఏప్రిల్ 2012లో రాజ్యసభకు నామినేట్ అయ్యారని, ఆయన 13 డిసెంబర్ 2013న సభకు వచ్చారని చెప్పారు. రేఖ ఏప్రిల్లో నామినేట్ అయ్యారని, ఆమె ఏడు రోజులు వచ్చారని, ఫిబ్రవరి 19, 2014న ఆమె సభకు వచ్చారన్నారు.
గురువారం ఎన్సీపీ నేత త్రిపాఠి వారి గైర్హాజరీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. క్రికెటర్గా సచిన్, నటిగా రేఖ అంటే తనకు ఇష్టమని, కానీ, ఎంపీలుగా ఉన్న వారు గైర్హాజరు కావడం సరికాదని అభిప్రాయపడ్డారు. వారు గైర్హాజరీ కావడం ద్వారా పార్లమెంటును, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారన్నారు.