మధ్య తరగతికి జోష్: బడ్జెట్ 2017లో ఆదాయపుపన్ను పరిమితి భారీగా పెంపు!
ఈ ఏడాది బడ్జెట్లో ముఖ్యంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం రెండున్నర లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఓ నెల ముందుగానే ప్రవేశపెడుతున్న కేంద్ర సాధారణ బడ్జెట్పై దేశ ప్రజల్లో ఆశలు మరింతగా పెరిగాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏకరమైన తాయిలాలు అందించనున్నారన్న దానిపై మధ్యతరగతి వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ఆకాంక్షలనూ ఈడేర్చే విధంగానే కొత్త 2017 బడ్జెట్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం రెండున్నర లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాధారణ, రైల్వే బడ్జెట్లను ఒకేసారి ప్రవేశ పెట్టడం, అలాగే నెల రోజుల ముందుగానే అంటే ఫిబ్రవరి ఒకటినే వీటిని పార్లమెంట్ ముందుంచాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో జైట్లీ బడ్జెట్పై అన్ని వర్గాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకూ, డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై మరిన్ని డిస్కౌంట్లు కల్పించేందుకూ జైట్లీ పలు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అందరికీ ఆవాస కల్పనే లక్ష్యంగా ప్రకటించిన మోడీ సర్కార్ ఈ దిశగా కూడా పలు రాయితీలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొత్త బడ్జెట్లో పన్ను లబ్ధిని చేకూర్చే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు. నోట్ల రద్దు కారణంగా దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకూ ఆర్ధిక మంత్రి కొంత వెసులుబాటు కల్పించవచ్చని తెలుస్తోంది.
అంతేగాక, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు కూడా సానుకూలంగా ఈ బడ్జెట్ ఉండేవిధంగా చూస్తున్నట్లు సమాచారం. అలాగై రైతులకు కూడా ఈ బడ్జెట్లో సముచిత స్థానం కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకునేందుకు ఈ బడ్జెట్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం.. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సంబంధిత వస్తువుల కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది.