ఇంట్రెస్టింగ్ : పాముకు MRI స్కాన్.. ఎందుకు తీశారు..ఎక్కడ తీశారు?
ముంబై: సాధారణంగా మనుషులకు ఏమైనా తీవ్రమైన గాయాలు తగిలితే వారికి ఎమ్ఆర్ఐ స్కానింగ్ (మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) తీస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ పాముకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీశారు. పోనీ అది ఏమన్నా పెంపుడు పామా అని అంటే అది కాదు. ఎక్కడో ముంబైలో ఎవరో దాన్ని చితకబాదితే గాయాలతో రోడ్డుపై కదలలేని స్థితిలో పడింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ....
పామును చితకబాదిన స్థానికులు
ముంబైలోని దహిసార్ ప్రాంతంలో పాము హల్చల్ చేస్తుంటే స్థానికులు దాన్ని చూసి చితకబాదారు. రక్తమోడుతూ కదలలేని స్థితిలో పాము రోడ్డుపై పడింది. ఇది చూసిన స్థానిక హవల్దారు పాముల పట్టే వ్యక్తి అనిల్ కుబాల్కు కబురు పంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అనిల్ కుబాల్ తీవ్రంగా గాయపడిన పామును చూసి వెంటనే పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ దీపా కత్యాల్ దానికి చికిత్స చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పాము వెన్ను విరిగినట్లు ఆయన ధృవీకరించారు.
డ్యామేజ్ ఎక్కడైందో తెలుసుకునేందుకు పాముకు స్కానింగ్
ఇక వెన్ను విరిగిన పాముకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా దానికి ఎక్కడ డ్యామేజ్ అయ్యిందో తెలుసుకునేందుకు ఎమ్ఆర్ఐ స్కాన్ తీశారు. సాధారణంగా మనుషులకు తీసే ఎమ్ఆర్ఐ స్కాన్ పాముకు తీయమని అడుగగా అక్కడి రేడియాలజిస్ట్ డాక్టర్ రవి థాపర్ ఇందుకు ఒప్పుకుని స్కాన్ తీశాడు. శరీరంలో ఏభాగం దెబ్బతినిందో రేడియో తరంగాలు ద్వారా విడుదలయ్యే ఫోటోలో తెలిసిపోతుందని చెప్పారు డాక్టర్ రవి థాపర్.
చికిత్సకు స్పందిస్తోన్న పాము...త్వరలో అటవీప్రాంతంలో వదిలేస్తాం
ప్రస్తుతం చికిత్సకు ఆ పాము స్పందిస్తోందని మరో వెటిరెనరీ డాక్టర్ త్రిష్ డిసౌజా తెలిపారు. "చికిత్సలో భాగంగా మందును ట్యూబ్లలో ఎక్కిస్తున్నాం.ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం లేదు. వెన్నులో దెబ్బబాగా తగిలింది. క్రమంగా పాము కోలుకుంటోంది. త్వరలో దాన్ని అటవీప్రాంతంలో వదిలి వేస్తాం "అని తెలిపారు డిసౌజా. మరోవైపు ఇంత ఖరీదైన ధర పెట్టి సాంకేతికతను వాడి పామును తిరిగి బతికించగలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు వైద్యులు.