2019 కసరత్తులు: బీజేపీలోకి ధోనీ, గంభీర్? జార్ఖండ్, ఢిల్లీ నుంచి పోటీ!
ముంబై: భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వస్తున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో భారత ప్రముఖ క్రికెటర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనే టీమిండియా కూల్ కెప్టెన్గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ.
కొత్త ఇన్నింగ్స్: బీజేపీలోకి గంభీర్, సెహ్వాగ్?, కూతురు కోసం పవార్, కుంభమేళాకు వెజిటేరియన్ పోలీస్
జార్ఖండ్ నుంచి ధోనీ
కాగా, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్లు 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారని వార్తలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ నుంచి గంభీర్..
గౌతమ్ గంభీర్ తన సొంత రాష్ట్రమైన ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్పై ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం. సైన్యం, దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో గంభీర్ స్పందిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, కొంతకాలం క్రితం మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాడు.
బీజేపీ కసరత్తులు
కాగా, ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పనితీరుపై పార్టీ వర్గాలు, అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 2019లో ఆమెకు బదులు గంభీర్ను పోటీ చేయించాలని బీజేపీ కసరత్తులు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ కప్ నేపథ్యంలో...
ఇక కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని ఆయన సొంత రాష్ట్రం జార్ఖండ్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ధోనీకున్న జనాదరణ అందరికీ తెలిసిందే. అతడి పేరు, ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ ధోనీతో వరుస చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, 2019లో ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ధోనీ రాజకీయాల్లోకి రావడం సాధ్యం కాదనే చెప్పాలి. ఇక గంభీర్ కూడా రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా సందేహంగానే మారింది.