ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్: నివేదికలో ధోనీ, రైనా పేర్లు?
ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలకు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్తో సంబంధం ఉందని బుకీ ఉత్తమ్ జైన్ అలియాస్ కిట్టీ త్రిచి రైల్వే ఎస్సీ సంపత్ కుమార్ ముందు వెల్లడించినట్లు సమాచారం. ముద్గల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేపట్టింది.
కాగా ఇటీవల జరిగిన ప్రపంచ కప్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన, ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్ల పేర్లు కూడా ఈ నివేదికలో ఉన్నట్లు ఓ స్పోర్ట్స్ మేగజైన్ పేర్కొంది. అయితే వారి పేర్లు తెలిపేందుకు మాత్రం ఆ మేగజైన్ రిపోర్టర్ నిరాకరించారు. సుప్రీం కోర్టు వద్ద నివేదిక ఉన్నందు వల్ల ఆ వివరాలను వెల్లడించలేమని ఆయన తెలిపారు.
స్పాట్ ఫిక్సింగ్తో సంబంధం ఉన్న వారిలో బిసిసిఐ మాజీ అధ్యక్షునితోపాటు ఆరుగురు ప్రముఖ ఆటగాళ్ల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బుకీలు చంద్రేష్ జైన్, అశ్వని అగర్వాల్తో జరిపిన సంభాషణలను పరిగణలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. పలు అంతర్జాతీయ మ్యాచులకు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు ఆటగాళ్ల పేర్లు కూడా నివేదికలో ఉన్నట్లు రిపోర్టర్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని చెప్పారు.