అప్పుడూ లేదు... ఇప్పుడూ లేదు... 'కనీస మద్దతు ధర'పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు...
కేంద్రం తీసుకొచ్చిన అగ్రి బిల్లులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ బిల్లులతో వ్యవసాయం కూడా కార్పోరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతుందని... రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అటు రైతులు కూడా ఈ బిల్లులను నిరసిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఈ బిల్లులతో కనీస మద్దతు ధరకు కూడా నోచుకోలేమని... కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 'కనీస మద్దతు ధర'ను తప్పనిసరి చేస్తూ బిల్లుల్లో చేర్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్పై తాజాగా కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు.
నరేంద్ర సింగ్ తోమర్ ఏమంటున్నారు...
'విపక్షాలకు నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నా. మీరు చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఒకవేళ కనీస మద్దతు ధర(MSP)కు చట్టం తప్పనిసరి అయితే.. మీ హయాంలో ఎందుకు చేయలేదు..? కనీస మద్దతు ధర అనేది గతంలో చట్టంలో పొందుపర్చలేదు... ఇప్పుడు కూడా అంతే...' అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. తద్వారా కనీస మద్దతు ధరపై విపక్షాల డిమాండ్కు కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదని తేల్చి చెప్పినట్లయింది.
రైతులకు లాభం చేకూరుతుందని...
కనీస మద్దతు ధర అనేది కేంద్ర విధానపరమైన నిర్ణయమని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇటీవల మోదీ ప్రభుత్వం రైతులకు 50శాతం లాభం ఉండేలా కనీస మద్దతు ధరను ప్రకటించిందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో మోదీ సర్కార్ ఓట్లతో సంబంధం లేకుండా నిబద్దతతో కూడిన నిర్ణయాలనే తీసుకుంటుందన్నారు. కొత్త బిల్లులతో రైతులకు భారీ లాభం చేకూరుతుందని ధీమాగా చెప్పారు. విపక్షాలు ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోవాలన్నారు.
Recommended Video
అగ్రి బిల్లులపై రగడ...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020,ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ),నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 ఇటీవల ఉభయ సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఇవి చట్టరూపం దాల్చనున్నాయి. ఈ బిల్లులు రైతులకు డెత్ వారెంట్ లాంటివేనని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... రైతులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం చెబుతోంది. రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని... కనీస మద్దతు ధర తప్పకుండా ఉంటుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్లు కూడా అలాగే కొనసాగుతాయన్నారు.మరోవైపు రైతులు,విపక్షాలు ఇప్పటికే ఈ బిల్లులను నిరసిస్తూ సెప్టెంబర్ 25న భారత్ బంద్కు సిద్దమవుతున్నాయి.