మహారాష్ట్రలో ఒక్కటే: మాలెగావ్ లో మజ్లిస్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో..!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బోణీ చేసింది. ఒక స్థానాన్ని గెలుచుకోగలిగింది. ముస్లింల ఓటు బ్యాంకు అధికంగా ఉండే మాలెగావ్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. మాలెగావ్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఫ్తి మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్.. భారీ విజయాన్ని నమోదు చేశారు. 1,17,242 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన ఆసిఫ్ షేక్ రషీద్ ను చిత్తు చేశారు. పోలైన ఓట్లల్లో మజ్లిస్ అభ్యర్థికి 58.52 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముంబై ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్: మహారాష్ట్రలో పలుచోట్ల గెలుపు
ఇదివరకు ముఫ్తి మహమ్మద్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చాలాకాలం పాటు కొనసాగారు. ఎన్సీపీ తరఫున మాలెగావ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించింది ఎన్సీపీ. ఫలితంగా ముఫ్తి మహమ్మద్ కు టికెట్ దక్కలేదు. దీనితో ఆయన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన మజ్లిస్ లో చేరారు. పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మాలెగావ్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. స్థానికంగా మంచి పేరు ఉండటం ముఫ్తి మహమ్మద్ కు కలిసి వచ్చింది. మాలెగావ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి 78,723 ఓట్లు పోల్ అయ్యాయి.
మొత్తం 44 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేయగా.. ఒక్క స్థానంలో విజయం సాధించిందా పార్టీ. 2014 ఎన్నికలతో బేరీజు వేసుకుంటే.. ఆ పార్టీ నష్టపోయినట్టే లెక్క. గత ఎన్నికల్లో మజ్లిస్ రెండు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఔరంగాబాద్ సెంట్రల్, బైకుల్లా స్థానాలను పోగొట్టుకుంది. బైకుల్లాలో శివసేన అభ్యర్థి విజయం సాధించారు. మాలెగావ్ స్థానంలో మజ్లిస్ ఖాతా తెరవడం ఇదే తొలిసారి. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన అభ్యర్థికే టికెట్ ను కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. బిహార్ అసెంబ్లీకి నిర్వహించిన ఉప ఎన్నికల్లో కిషన్ గంజ్ స్థానాన్ని మజ్లిస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.