ఉగ్రవాదుల వల్లే ఎన్నికలు ప్రశాంతం: జమ్మూకాశ్మీర్ సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే ముఫ్తీ మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడానికి అనువైన వాతావరణం కల్పించిన ఘనత సరిహద్దు ఆవలి వైపు ఉన్న ప్రజలు (పాక్), హురియత్, ఉగ్రవాద వర్గాలకే దక్కుతుందని వ్యాఖ్యానించి వివాదానికి తెరదీసారు.
‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని సృష్టించిన క్రెడిట్ హురియత్కు, మిలిటెంట్ గ్రూపులకే దక్కుతుంది. ఈ విషయాన్ని నేను అధికారికంగా చెప్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీకి సైతం ఈ విషయం చెప్పాను' అని ఆదివారం జమ్మూ, కాశ్మీర్లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఫ్తీ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
అంతేకాదు ‘సరిహద్దుకు ఆవలి వైపు ఉన్న ప్రజలు (పాక్) కూడా ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూశారు. వాళ్లు గనక ఏదైనా చేసి ఉంటే ఎన్నికలు శాంతియుతంగా జరిగి ఉండేవి కావనే విషయాన్ని నేను వినమ్రంగా అంగీకరిస్తున్నాను. ఎన్నికలకు విఘాతం కలగడానికి చిన్నపాటి సంఘటన చాలనే విషయం మీకు తెలుసన అన్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ సాఫీగా జరగడానికి వాళ్లు అనుమతించారు. ఇది మాకు ఆశను కల్పిస్తోంది' అని ముఫ్తీ చెప్పారు.
‘వాళ్లు (ఉగ్రావాలు) గనుక ఏమైనా చేసి ఉంటే ఎన్నికలు సాఫీగా జరిగి ఉండేవి కావు' అని కూడా ముఖ్యమంత్రి సయీద్ అన్నారు. మాజీ వేర్పాటువాద నాయకుడైన అబ్దుల్ గనీ లోనెనను మంత్రివర్గంలో చేర్చుకోవడం మిగతా వేర్పాటువాదులు అదే దారిలో నడవడానికి ఒక మార్గం కావాలని కూడా ఆయన అభిలషించారు. జమ్మూ, కాశ్మీర్ అభివృద్ధిలో ఒక అదర్శంగా నిలవాలంటే శాంతి చాలా ముఖ్యమని అన్నారు.సిఎంతోపాటు మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, బిజెపికి చెందిన నిర్మల్ సింగ్, కేబినెట్ మంత్రి హీబ్ ద్రాబు కూడా పాల్గొన్నారు.
కాగా, సయీద్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని బిజెపిని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో ఎన్నికలు సాఫీగా జరగడానికి పాకిస్థాన్, హురియత్, మిలిటెంట్లు అనుమతించారని ముఖ్యమంత్రి అంటున్నారు. భద్రతా దళాలు, పోలింగ్ సిబ్బంది పాత్ర ఏమిటో వివరించాలని బిజెపిని కోరుతున్నాను' అని ఒమర్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
తగ్గని ముఫ్తీ
సరిహద్దుల్లో సైన్యం ఎప్పుడు ఉంటుందని మహ్మద్ ముఫ్తీ చెప్పారు. పాక్ పైన తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్ననని చెప్పారు. జమ్మూ సహా అన్ని సమస్యలు చర్చల ద్వారనే పరిష్కారమవుతుందని చెప్పారు. నా వ్యాఖ్యలపై మీడియా రాద్దాంతం చేస్తోంది. పాక్తో వాజపేయి విధానాలు కొనసాగాలని నాన్న కోరుకునే వారన్నారు.