భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యం
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి లేదా బలహీనపడటానికి కారణం మొఘల్ పాలకులు, బ్రిటీషు పాలకులే అని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. మొఘలులు, బ్రిటీషర్లు దేశంలోకి రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ అగ్రస్థానంలో ఉండటంతోపాటు ఎంతో బలంగా ఉండేదని యోగీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ప్రపంచ హిందూ ఆర్థిక వ్యవస్థ సమాఖ్యలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మొఘలులు భారత దేశంలోకి ప్రవేశించేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉండేదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా మూడింట ఒకటో వంతు ఉండేదని చెప్పారు. మొఘలులు వచ్చి ఆర్థిక వ్యవస్థకు గండికొట్టారని దాన్నే బ్రిటీషువారు కూడా కొనసాగించారని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. మొఘలులు భారత్కి రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలో 36శాతం వాటా కలిగి ఉండేదని వెల్లడించారు. ఇక బ్రిటీషువారు వచ్చే సమయానికి అది 20శాతంకు పడిపోయిందని యోగీ ఆదిత్యనాథ్ సభలో చెప్పారు.
ఇక 200ఏళ్ల బ్రిటీషు పాలనలో భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు యోగీ ఆదిత్యనాథ్. వారు దేశం విడిచేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలో 4 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఒక్క ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో మంచి అధికారులున్నారని వారి సహకారంతో ఉత్తర్ప్రదేశ్ను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతానని చెప్పారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని చెప్పారు.