ముహూర్తం కుదిరింది, ఆదివారమే మంత్రివర్గ విస్తరణ, ఇప్పటికే ఐదుగురి రాజీనామా, కంభంపాటికి ఛాన్స్?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ను విస్తరించే అవకాశం ఉంది. కొందరికి పదవీ గండం ఉంటే.. మరికొంత మంది కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. కొందరి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ను విస్తరించే అవకాశం ఉంది. 8 మందికి పదవీ గండం ఉంటే.. మరో 8 మంది కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇంకో ఏడెనిమిది మంది మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉంది.
మొత్తం మీద కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ప్రభావం 25 మందిపై పడనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. వారిలో స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు కూడా.
అనారోగ్యం వల్లే ఉమాభారతి రాజీనామా...
ఇక, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆరోగ్య కారణాలు చూపి రాజీనామా చేస్తే.. పార్టీ ఆదేశాల మేరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించాల్సి ఉంది.
రాజీవ్ ప్రతాప్ రూడీ పయనం ఎటు?
బిహార్లో జేడీయూ మంత్రివర్గంలో చేరడానికి రాజీవ్ ప్రతాప్ రూడీకి మార్గం సుగమం చేశారని విశ్లేషకులు అంటుంటే.. ఆయనకు పార్టీ పదవిని అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నిర్మలా సీతారామన్కు పార్టీ బాధ్యతలు?
అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్కు పదవీ గండం తప్పదని అంటున్నారు. ఆయనతోపాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి కలాజ్ర్ మిశ్రా కూడా రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. వీరిలో నిర్మలా సీతారామన్కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
గడ్కరీకి రైల్వే, అశోక్ గజపతి శాఖ మార్పు?
అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖను అప్పగించనున్నారు. ఇటీవలి వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు స్థాన చలనం తప్పట్లేదు. ఆయనతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శాఖను కూడా మార్చనున్నారు.
పీయూష్ గోయల్ కు పదోన్నతి, రక్షణ శాఖకు జైట్లీ...
విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్కు పదోన్నతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు చూస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తి స్థాయిలో అప్పగించి, పీయూష్కు ఆర్థిక శాఖ అప్పగించనున్నారు.
ఏపీ నుంచి కంభంపాటికి ఛాన్స్?
ఏపీ నుంచి బీజేపీ తరఫున కంభంపాటి హరిబాబుకు అవకాశం ఉందంటున్నారు. కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరుతుందా? లేదా? అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. అలాగే, జేడీయూకు ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వనుండగా, అన్నాడీఎంకే చేరికపై ఇంకా సందిగ్ధం వీడలేదు. కేబినెట్లో చేరేది లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.
మోడీతో అమిత్ షా భేటీ...
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గురువారం భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అంతకుముందు ఎనిమిది మంది మంత్రులు అమిత్ షాతో భేటీ కావడం గమనార్హం. అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, జితేంద్రసింగ్, నరేంద్రసింగ్ తోమర్, పీపీ చౌదరి, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు షాను కలిసిన వారిలో ఉన్నారు. కాగా, గుజరాత్ ఎన్నికలపై చర్చించడానికే ఆ రాష్ట్ర ఇన్చార్జిలు, కేంద్ర మంత్రులు అమిత్ షాతో భేటీ అయ్యారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అన్నాడీఎంకేకు అవకాశం?
మరోవైపు, కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, మరికొద్ది రోజులే తాను రక్షణ మంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయని అరుణ్ జైట్లీ విలేకరులకు తెలిపారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా అమిత్తో భేటీ అయ్యారు. కేబినెట్లో తమకూ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మోదీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినా.. పితృపక్షాల కారణంగా సెప్టెంబరు నెలాఖరు వరకు మంచి రోజులు లేవని, అందుకే 2వ తేదీనే విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్టు బీజేపీ ముఖ్య నేత తెలిపారు.
యూపీ బీజేపీ అధ్యక్షుడిగా మహేంద్ర పాండే
ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర పాండేను అమిత్షా నియమించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కేశవప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎం కావడంతో మహేంద్ర పాండేను నియమించాల్సి వచ్చింది. దీంతో పాండేకు పదవీ గండం ఉందన్న వార్తలూ వినవస్తున్నాయి.