మరో విప్లవం: రిలయన్స్ నుంచి జియో గిగా ఫైబర్
Recommended Video
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును గురువారం ఆవిష్కరించారు. ఇప్పటికే జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ... కొత్తగా జియో గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ప్రారంభించారు. 1,100 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని... జియోగిగా ఫైబర్ ద్వారా 600కు పైగా ఛానెళ్లను వీక్షించడంతో పాటు, వేల సంఖ్యలో సినిమాలు, పాటలు కూడా వినొచ్చని చెప్పారు అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ.
జియో గిగా ఫైబర్ ప్రకటనతో పాటు మరో వర్షాకాలపు ఆఫర్ను కూడా రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఇప్పటకే జియో ఫీచర్ ఫోన్లను వాడుతున్న వారు కేవలం రూ.501 చెల్లించి కొత్త ఫోన్ తీసుకోవచ్చని తెలిపింది. అంటే రూ.1500 ఉన్న జియో ఫోన్ కేవలం రూ. 501కే రిలయన్స్ అందిస్తోంది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జియో ప్రాజెక్టు దేశంలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి తాలూకాకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మంది ప్రజలు జియో ఫోన్ను వినియోగిస్తున్నారన్నారు.
ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ర్యాంకు 134గా ఉందని గుర్తు చేసిన అంబానీ త్వరలోనే ఒక విప్లవాన్ని తీసుకొస్తామన్నారు. బ్రాడ్ బ్యాండ్ సేవల్లో భారత్ను తొలి 5 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తామని అంబానీ చెప్పారు. డిజిటల్ వనరులను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే జియో రూ. 2లక్షల 50వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని... ప్రపంచంలోనే ఇంత భారీ పెట్టుబడులు ఎవరూ పెట్టలేదని అంబానీ చెప్పారు.