ముఖేశ్.. దమ్ముంటే మమల్ని ఆపు -అంబానీ ఇంటికి ‘బాంబు’కేసులో షాకింగ్ ట్విస్ట్ - తెరపైకి ‘హింద్’ సంస్థ
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత దగ్గరి వ్యక్తి అయిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భద్రతకు సంబంధించి మరో షాకింగ్ అంశం తెరపైకి వచ్చింది. ముంబైలోని ఆయన ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన ముష్కరులు.. ఇప్పుడు ఆయనకు నేరుగా సవాలు విసిరారు. దమ్ముంటే తమను ఆపాలంటూ సంచలన ప్రకటన విడుదల చేశారు..
పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలు
చేసింది మేమే.. ఆపండి చూద్దాం..
ముంబైలోని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి బాంబు పేలుడు హెచ్చరిక కేసులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన ఘటనకు బాధ్యత తమదేనంటూ 'జైష్-ఉల్-హింద్' అనే సంస్థ ప్రకటన చేసింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పెద్ద ముప్పు ముందుందని ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ మెసేజ్ లో హెచ్చరించింది. పేలుడు పదార్థాలు పట్టుబడి మూడు రోజులు గడుస్తున్నా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సైతం తమ జాడను కనిపెట్టలేకపోయాయని ఎద్దేవ చేస్తూ.. 'దమ్ముంటే మమ్మల్ని ఆపండి..'అని సదరు సంస్థ సవాలు విసిరింది. కాగా,
ఈసారి అంబానీ కొడుకు కారు పైకే..
''మీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో వాహనాన్ని పార్క్ చేసిన మా సోదరుడు ఇప్పటికే 'సేఫ్ హౌస్' కు చేరుకున్నాడు. ఈ సారి అలాంటి (పేలుడు పదార్థాలు నింపిన) వాహనం నీ(అంబానీ) కొడుకు కారుపైకే దూసుకుపోగలదు. అలా జరగొద్దని మీరు అనుకుంటే, వెంటనే బిట్ కాయిన్ ద్వారా మాకు డబ్బులు పంపండి. అలా కాదనుకుంటేమాత్రం.. మమల్ని ఆపండి చూద్దాం.. '' అంటూ 'జైష్ ఉల్ హింద్' సంస్థ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆదివారం ఒక ప్రకటన చేసింది. అందులో..
ఎక్కడిదీ జైష్ ఉల్ హింద్?
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని టార్గెట్ చేస్తూ సంచలనానికి పాల్పడింది మేమేనంటూ ప్రకటన చేసిన 'జైష్ ఉల్ హింద్' సంస్థ ఇప్పటిదాకా పోలీసులు, భద్రతా దళాల రికార్డుల్లో లేదని, బహుశా, సరికొత్తగా వెలసిన సంస్థ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దమ్ముంటే తమను ఆపాలంటూ సవాలు విసిరడంతోపాటు కీలక సందేశాన్ని కూడా టెలిగ్రామ్ ప్రకటనలో ఉంచిందా సంస్థ. ''అల్లాను గానీ, ఆఖరు రోజులు(యుగాంతం)ను గానీ నమ్మనివాళ్లు.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. '' అని జైషే హింద్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడుకు బాధ్యత వహించిన సంస్థతో ఈ ఘటనకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు..
మమ్మల్ని కనిపెట్టలేరు..
అంబానీ ఇంటివద్ద పార్క్ చేసి ఉన్న వాహనంలో జిలిటెన్ స్టిక్స్ వదిలి వెళ్లిన ఘటనలో నీతా అంబానీ పేరిట కూడాబెదరింపు లేఖను కూడా పోలీసులు గుర్తించడం తెలిసిందే. దమ్ముంటే అంబానీ, దర్యాప్తు సంస్థలు తమను ఎదుర్కోవాలని, ఢిల్లీలో మేమేం చేసినా మీరేమీ చేయలేరని, జాడ కనిపెట్టడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మోసాద్ కూడా విఫలమైందని, అల్లా దయతో ప్రతిసారీ ఫెయిల్ అవుతారని సదరు సంస్థ పేర్కొంది. కాగా, టెలిగ్రామ్ సందేశాన్ని లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు.. ముష్కరుల జాగ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో అంబానీ, అదానీలకు లబ్ది చేకూరుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ.. ఈ బాంబు బెదిరింపుల వ్యహారం రాజకీయంగానూ కలకలం రేపుతున్నది.
ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా -జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ కొవిడ్ వ్యాక్సిన్కు అమెరికా ఆమోదం