కూతురు కన్యాదానం, అమితాబ్ మాటలు: ముఖేష్ అంబానీ భావోద్వేగం, కంటతడి
ముంబై: కూతురు ఈషా అంబానీ పెళ్లిలో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రసంగం అనంతరం ఆయన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురును పెంచి, పెద్ద అత్తవారింటికి పంపిస్తూ కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో ఏ తల్లిదండ్రుల కళ్ల నుంచైనా కన్నీళ్లు ఉబికివస్తాయి.
ఇందుకు ముఖేష్ అంబానీ కూడా మినహాయింపు కాదు. ఓ తండ్రిగా ఆయన కంట కూడా కన్నీళ్లు వచ్చాయి. తన కూతురు ఈషా అంబానీని ఆనంద్ పిరమిల్కు ఇచ్చి బుధవారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన విషయం తెలిసిందే.
ముఖేష్ భావోద్వేగం
ఈ పెళ్లి వేడుకలో ముఖేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ గుజరాత్ సంప్రదాయం ప్రకారం కన్యాదానానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఓ లేఖను చదివి వినిపించారు. కూతురిని మెట్టినింటికి పంపుతుంటే ఓ తండ్రి పడే ఆవేదనను అక్షరాల్లో కూర్చి లేఖను రాశారు. ఆ లెటర్ను చదువుతుంటే ముఖేశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భావోద్వేగానికి లోనై ముఖేశ్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ ఉద్వేగానికి గురయ్యారు.
గుజరాతీ సంప్రదాయం ప్రకారం పెళ్లి
ఈషా, ఆనంద్ల పెళ్లి గుజరాతీ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ తంతులో పెళ్లి కూతురు ఈషాను ఆమె సోదరులు ఆకాశ్, అనంత్, అన్మోల్ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్ పట్టి పెళ్లి మండపం వద్దకు తీసుకు వచ్చారు. నృత్య కళాకారులతో బారాత్ బృందం ముందు వచ్చింది. రోల్స్ రాయిస్ కారులో వరుడు ఆనంద్, తన ఫ్యామిలీతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. ఇరు కుటుంబాలు, బంధువులు, ప్రముఖుల మధ్య వారిద్దరు ఒక్కటయ్యారు.
పెళ్లికి ప్రముఖులు
బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన ఈ వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
అంబానీ భావోద్వేగం
ఈ సమయంలో అమితాబ్ బచ్చన్ మంత్రాలకు సంబంధించిన పరమార్థం చెప్పారు. అదే సమయంలో ఈషాను అల్లుడి చేతిలో పెట్టారు. ఈ సమయంలో ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు.