సత్తా చాటిన అంబానీ: ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జబితాలో టాప్
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా ఫోర్బ్స్ రూపొందించిన ‘గ్లోబల్ గేమ్ ఛేంజర్స్’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో
న్యూయార్క్: భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా ఫోర్బ్స్ రూపొందించిన 'గ్లోబల్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడం, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంతో సత్తా చాటినందుకు ముకేష్ అంబానీకి ఈ స్థానం దక్కింది.
గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 25మంది ధైర్యవంతులైన నాయకులతో కూడిన ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించగా, ఇందులో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. భారతదేశంలో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడంలో ఆయన గేమ్ ఛేంజింగ్ సామర్థ్యంపై ఫోర్బ్స్ ప్రశంసలు కురిపించింది.
ఆయిల్ నుంచి గ్యాస్ వరకు వ్యాపారాల్లో సత్తా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించి, ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్ను ఆఫర్ చేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. అంతేగాక, ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ల కష్టమర్ల మార్కును చేరుకుందని రిలయన్స్ జియోను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ను కొనియాడింది.
కాగా, గేమ్ ఛేంజింగ్ జాబితాలో హోం అప్లియన్సెస్ డైసన్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్, అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ బ్లాక్ రాక్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ మహ్మద్ బిన్ సల్మాన్, స్నాప్ సహా వ్యవస్థాపకుడు ఇవాన్ స్పేగల్, చైనీస్ రైడ్ షేరింగ్ దిగ్గజం దిది చుక్సింగ్ వ్యవస్థాపకుడు చెంగ్ వే, ఆఫ్రికన్ రిటెయిల్ టైకూన్ క్రిస్టో వేజ్ చోటు దక్కించుకున్నారు.