ఆ ఆలయానికి 20 కేజీల బంగారం కానుకగా ఇచ్చిన ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ
ఆసియా కుబేరుడు, ఇండియా లోనే టాప్ మోస్ట్ పారిశ్రామికవేత్త, భారతదేశ టాప్ బిలియనీర్ ముఖేష్ అంబానీ తన దైవ భక్తిని చాటుకున్నారు. దేశంలోని సుప్రసిద్ధ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవి ఆలయం కోసం ఆయన 20 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. గౌహతిలో ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయానికి మూడు గోపుర శిఖరాలను ఈ బంగారంతో తీర్చిదిద్దనున్నారు.
తిరుమలలో కొత్త రూల్.. ఆ వాహనాలతో వెళ్తే అనుమతి లేదు
కామాఖ్య ఆలయానికి 20కేజీల బంగారం కానుకగా ఇచ్చిన ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ కి , ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కి దైవభక్తి ఎక్కువ . గతంలో కామాఖ్య ఆలయానికి సందర్శించిన సమయంలో ముఖేష్ అంబానీ దేవాలయ నిర్వహణ కమిటీ కి ఆలయానికి పైనున్న గోపుర శిఖరాలు బంగారు తాపడం చేయిస్తానని , అందుకు అయ్యే ఖర్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆలయ గోపుర శిఖరాల బంగారం తాపడానికి కావలసిన 20 కేజీల బంగారాన్ని అందించారు.
ఆలయ గోపురాల బంగారు తాపడం పనులను చేయిస్తున్న టాప్ మోస్ట్ పారిశ్రామికవేత్త
నీలాచల్ హిల్స్ లోని కామాఖ్య ఆలయానికి దీపావళి బహుమతిగా 20 కేజీల బంగారాన్ని అందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ,దీపావళి వరకు అమ్మవారి ఆలయ శిఖరం బంగారు తాపడం పనులను పూర్తిచేయాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. రిలయన్స్ కు చెందిన జ్యువెలరీ విభాగం ఈ పనులను నిర్వహిస్తోంది. స్వయంగా ముఖేష్ అంబానీ ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నెల రోజుల నుండి రిలయన్స్ గ్రూప్ పంపిన ఇంజనీర్లు మరియు కార్మికులు అమ్మవారి ఆలయ శిఖరాల తాపడం పనులను నిర్వహిస్తున్నారు.
బంగారు తాపడంతో ఆలయానికి కొత్త శోభ
ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు . అన్నీ అనుకూలిస్తే ఈ దీపావళికి ముందే ఆలయ శిఖరాల బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు ఆలయ పూజారి దీప్ శర్మ . బంగారు తాపడంతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంటుందని ఆయన తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ దంపతులు ఆలయాన్ని దర్శించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయమైన కామాఖ్య శక్తిపీఠం మొన్నటి వరకు మూసివేయబడింది. అక్టోబర్ 12వ తేదీ నుండి తిరిగి ఆలయాన్ని తెరిచి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న బంగారం తాపడం పనులతో కామాఖ్య శక్తిపీఠం కళకళలాడనుంది.