ముకేష్ అంబానీ మరో రికార్డు: లీ కా షింగ్ను దాటేసి, ఆసియాలోనే నెం.2
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లీ కా షింగ్ను అధిగమించి.. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లీ కా షింగ్ను అధిగమించి.. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అంబానీ కంపెనీకి ఈ ఏడాది మరో 12.1 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.77,000కోట్లు చేకూరినట్లు బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండరెక్స్ రిపోర్టు పేర్కొంది.
ఆయిల్ నుంచి టెలికాం వరకు ముకేష్ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్లో రికార్డులు సృష్టిస్తుండటంతో ఆయన సంపద ఈ మేరకు పెరిగినట్లు బ్లామ్బర్గ్ వెల్లడించింది. కాగా, అంబానీ ఇటీవలే '0'ధరకే మొబైల్ అంటూ మొబైల్ మార్కెట్లో జియో ఫోన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానుంది.
కాగా, గత సెప్టెంబర్లో లాంచ్ చేసిన టెలికాం బిజినెస్ల నుంచి ఇంకా ఆయన, ఆయన కంపెనీ షేర్ హోల్డర్స్ లాభాలను ఆర్జించాల్సి ఉంది. 2012 మార్చి నుంచి గ్రూప్ రుణాలు మూడింతలు అయినట్లు కూడా తెలిపింది. అయితే, 90శాతం రెవెన్యూలు రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లు, రిటైల్, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్ అధినేత తన సంపదను భారీగా పెంచుకుంటున్నారు.
అయితే, పెరుగుతున్న రుణాలపై మాత్రం స్పందించడానికి రిలయన్స్ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2016లో బ్లూమ్బర్గ్ బిలీనియర్ ఇండెక్స్లో 29వ స్థానంలో ఉన్న ముకేష్ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19వ స్థానానికి ఎగబాకారు.