రిచెస్ట్ వ్యక్తుల జాబితాలో బాలకృష్ణ.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
న్యూఢిల్లీ : ఫోర్బ్స్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అత్యంత ధనవంతుల జాబితా. ఇప్పుడా జాబితాలో పతంజలి సహా వ్యవస్థాపకుడు బాలకృష్ణ చోటు సంపాదించుకున్నారు. సుమారు 16వేల కోట్ల ఆస్తులతో ఆయన ఇండియాలోని వందమంది అత్యంత ధనవంతుల జాబితాలో 48వ స్థానాన్ని దక్కించుకున్నారు.
వినిమయ వస్తువుల రంగంలో ప్రముఖ బ్రాండ్స్ అన్నింటికి పోటీగా తన వ్యాపార పరిధిని పతంజలి సంస్థ వేగంగా విస్తరించుకుంటూపోతున్న సంగతి తెలిసిందే. సంస్థ వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబాకు సహాయకుడిగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ.. సంస్థ సహా వ్యవస్థాపకుల్లో ఒకరు. సంస్థ నికర విలువ ఆధారంగా.. సంస్థలో బాలకృష్ణకు 92శాతం వాటాను పరిగణలోకి తీసుకుని ఆయనకు ఫోర్బ్స్ జాబితాలో చోటు కల్పించినట్లు సంస్థ అధికారులు తెలిపారు.
నిజానికి పతంజలి వ్యవస్థాపకుడైన రామ్ దేవ్ బాబా పేరిటే ఎక్కువ సంపద ఉండవచ్చన్న అనుమానం రావచ్చు. దీనికి ఫోర్బ్స్ చెప్పిన సమాధానం ఏంటంటే.. రామ్ దేవ్ బాబాకు పతంజలిలో వాటాలున్నప్పటికీ.. సంస్థ క్రియాశీలక కార్యకలాపాలన్ని బాలకృష్ణే పర్యవేక్షిస్తారని, కంపెనీ వాస్తవ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆయనే అని పేర్కొంది ఫోర్బ్స్.
ఇక గతేడాది దాదాపు 5వేల కోట్ల మార్కు బిజినెస్ ను నిర్వహించిన పతంజలి.. ఈ ఏడాది అంతకు రెట్టింపు మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకుంది. ఇదంతా పక్కనబెడితే.. భారతీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 22.7 బిలియన్ డాలర్లతో ఎప్పటిలాగే అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.