అంబానీ - అదానీలే అత్యంత సంపన్నులు: వీరి నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మరోసారి భారత అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రముఖ మ్యగజీన్ ఫోర్బ్స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి కూడా ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ 51.4 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది. జియో టెలికాం ద్వారా ముఖేష్ అంబానీ ఆస్తులకు మరో 4.1 బిలియన్ డాలర్లు చేరినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో ఆస్తులు పెరగడం ఒక సవాలుగా పేర్కొంది ఫోర్బ్స్. ఇక జాబితాలో నిలిచిన అత్యంత ధనికుల ఆస్తులు ఓవరాల్గా 8శాతంకు పడిపోయినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇక గతేడాది విడుదల చేసిన జాబితాలో టాప్ స్థానాల్లో ఉన్న చాలామంది బిజినెస్ టైకూన్లు ఈ సారి తమ ర్యాంకును కోల్పోయారు. గతేడాది విప్రో టైకూన్ అజీజ్ ప్రేమ్జీ 2వ స్థానంలో ఉండగా ఈ సారి ఆయన 17వ స్థానానికి దిగజారారు. అయితే ఈ ఏడాది మార్చిలో విప్రో అధినేతగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన వారసుడిగా మరొకరికి ప్రకటించారు అజీజ్ ప్రేమ్జీ. ఇక మరో పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఆస్తుల్లో పెరుగుదల కనిపించింది. 15.7 బిలియన్ డాలర్లతో ఆయన ఎనిమిది స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచారు.
ఇక అంబానీ అదానీల తర్వాత అశోక్లేలాండ్ అధినేతలు, హిందూజా సోదరులు, షాపూర్జీ పల్లోన్జీ గ్రూపునకు చెందిన పల్లోన్జీ మిస్త్రీ, కోటాక్ మహేంద్ర బ్యాంకు అధినేత ఉదయ్ కొటాక్, హెచ్సీఎల్ టెక్నాలజీకి చెందిన శివ్ నాడార్లు వరసగా నిలిచారు. ఉదయ్ కొటాక్ ఆస్తుల్లో 4 బిలియన్ డాలర్లు చేరడంతో ఆయన టాప్ ఐదులో స్థానం పొందగలిగారు. ఇక ఈ సారి అత్యంత సంపన్నుల జాబితాలో ఆరుగురు కొత్తవారికి చోటు లభించింది. 1.91 బిలియన్ డాలర్లతో బైజూ రవీంద్రన్ 72వ స్థానంలో నిలువగా, హల్దీరామ్ స్నాక్స్ అధినేతలు మనోహర్ లాల్ మరియు మధుసూదన్ అగర్వాల్లు 1.7 బిలియన్ డాలర్లతో 86వ స్థానంలో నిలిచారు. జాక్వార్ అధినేత రాజేష్ మెహ్రా 1.5 బిలియన్ డాలర్లతో 95వ స్థానంలో నిలిచారు.