జేపీ నడ్డా మార్క్ చాతుర్యం: ముకుల్ రాయ్కి ఉపాధ్యక్ష పదవీ, కారణమిదేనా...?
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తన టీమ్ ప్రకటించారు. అయితే అందులో చాలా మార్పు, చేర్పులు ఉన్నాయి. ఆ విధంగా ముకుల్ రాయ్కు పదోన్నతి లభించింది. వాస్తవానికి రాయ్కు ప్రమోషన్ వెనక చాలా తతంగమే నడిచింది. తనను ప్రమోట్ చేయలేదని ఆయన భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికల జరగబోతున్న క్రమంలో.. నడ్డా ముందుచూపుతో వ్యవహారించారు. రాయ్ను ఉపాధ్యక్షుడిగా ప్రమోట్ చేశారు.
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో..
బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ మమతా బెనర్జీతో విభేదించి 2017లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఇంటిపై గల పోస్టర్లు తీసేయడం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. దీంతోపాటు మమతతో మాట్లాడరని.. తిరిగి సొంతగూటికి వెళతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది.
రాయ్ ప్రమోట్..
పరిస్థితిని నిశీతంగా గమనించిన నడ్డా.. తన టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో రాయ్ని కార్యవర్గ సభ్యుడి నుంచి ఉపాధ్యక్షుడిగా ప్రమోట్ చేశారు. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను ఉపాధ్యక్షుడిగా నియమించడంపై రాయ్.. జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. ఇతరులతో కలిసి పనిచేస్తానని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. తన నియామకం తర్వాత దిలీప్ గురించి రాయ్ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరి మధ్య సఖ్యత లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అనుపమ్ హజ్రా కూడా..
ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రాంశ్ బిజ్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీఎంసీ నుంచి గెలవగా.. గతేడాది మే లో మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీలో చేరారు. మరోవైపు టీఎంసీ మాజీ ఎంపీ అనుపమ్ హజ్రాను కూడా నడ్డా ప్రమోట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించారు.