తప్పుకాదు: కిరణ్ ధిక్కారంపై ముకుల్ ట్విస్ట్, శ్రీధర్ ఫైర్
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయం చెప్పినంత మాత్రాన క్రమశిక్షణారాహిత్యం కాదని, తమ పార్టీ అధిష్టానం ఎలాంటి విప్ జారీ చేయలేదని ఏఐసిసి నేత ముకుల్ వాస్నిక్ సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి 30వ తేదీ వరకు సమయమిచ్చారన్నారు.
తెలంగాణ బిల్లు పైన అసెంబ్లీలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవచ్చునని తెలిపారు. అదే సమయంలో ముకుల్ వాస్నిక్ తీర్మానం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. బిల్లు పైన చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం గురించి ఆలోచిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎనభై మందికి పైగా శాసన సభ్యులు శాసన సభలో మాట్లాడారని చెప్పారు. ఎనిమిది వేలకు పైగా సవరణలు వచ్చాయన్నారు.
కిరణ్పై శ్రీధర్ బాబు ఆగ్రహం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాశ, నిస్పృహలోనే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని శ్రీధర్ బాబు హైదరాబాదులో మండిపడ్డారు. అధికారిక తీర్మాన ప్రతిపాదనను సభాపతి తిరస్కరించాలని కోరారు. కిరణ్ నిర్ణయం రాజ్యాంగ, చట్ట విరుద్దమన్నారు. ముఖ్యమంత్రిపై అధిష్టానం పెట్టే విషయమై ఆలోచిస్తామన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను కిరణ్, చంద్రబాబులు పట్టించుకోవడం లేదని, మంత్రులే పోడియం వద్దకు వెళ్లిన సందర్భం శాసన సభ చరిత్రలో ఎప్పుడు లేదన్నారు. మంత్రులే పోడియం వద్దకు వెళ్లారంటే కిరణ్ పైన ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతోందన్నారు.
ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వడం, సభ స్తంభించడం మంచిదేనని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నోటీసు ప్రభుత్వానిదా కాదా అనే విషయాన్ని సభాపతి తేల్చాలని చెప్పారు. మరోవైపు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి పైన గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఆగదు: కోదండ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో ఆగదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన కిరణ్ను తప్పించాలని డిమాండ్ చేశారు. బిల్లు అసమగ్రంగా ఉందన్నప్పుడు గడువు పెంచాలని ఎలా కోరుతారని ప్రశ్నించారు.