ములాయం, బీజేపీపై బెహన్ జీ గుస్సా .. తాజ్ కేసు తిరగదోడేందుకే ఒక్కటయ్యారని ఫైర్, అఖిలైశ్పైనా విమర్శలు
న్యూఢిల్లీ : బీఎస్పీ- ఎస్పీ బంధం ముణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఎన్నికల ముందు ఒక్కటైన కూటమి .. ఫలితాల తర్వాత దూరం దూరంగా ఉండిబోయింది. ఓటమికి కారణం మీరేనంటూ ఆ పార్టీ అధినేతలు బాహాటంగానే దూషించుకున్నారు. భవిష్యత్తులో కలిసి పోటీచేయమని స్పష్టంచేశారు. అయితే ఇటీవల ఎంపీలుగా ఎన్నికైన నేతలతో ఆదివారం బీఎస్పీ చీఫ్ మాయావతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ అధినేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
నో .. నో ...
ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్పై విమర్శలు గుప్పించారు బెహన్ జీ మాయావతి. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. అంతేకాదు తాజ్ కారిడార్ కేసు తిరిగి విచారణ జరిపించేందుకు బీజేపీతో జతకట్టారని మండిపడ్డారు. 2012లో అప్పటి యూపీ సీఎం మాయావతి చారిత్రక కట్టడం తాజ్ వద్ద కారిడార్ నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.17 కోట్లు. అయితే ఇందులో అవినీతి జరిగిందని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో .. విచారణ జరుపాలని సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసింది. ఈ ప్రాజెక్టుతో మేలు జరిగింది మాయావతికేననే అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతేకాదు ఆమె ఆస్తులు కూడా పెరిగాయని కేసు విచారణ జరగుతుంది. ఈ క్రమంలో ములాయం .. బీజేపీతో చేతులు కలిపారని సంచలన ఆరోపణలు చేశారు మాయావతి.
కొడుకును వదల్లేదు ....
తండ్రి మూలాయం సింగ్పై విరుచుకుపడ్డ మాయావతి .. కుమారుడు అఖిలేశ్ యాదవ్ను కూడా వదల్లేదు. అఖిలేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, యాదవులు, దళితుల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడు ఏం చేయని అఖిలేశ్ .. లోక్ సభ ఎన్నికల్లో ఏం చేస్తారని ఓటర్లు భావించి ఉండొచ్చని తెలిపారు. దీంతో ప్రజలు తమ కూటమి వైపు మొగ్గుచూపలేదని పేర్కొన్నారు. దీంతో తాము ఇక భవిష్యత్తులో ఎస్పీతో కలిసి పనిచేయబోమని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలతో చెప్పారు బెహన్ జీ. ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేశ్ .. మాయావతిని స్వయంగా కలువకపోవడం .. కనీసం ఫోన్లో మాట్లాడకపోవడం కూడా ఒక కారణమై ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు కనీసం ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలనే అఖిలేశ్ సూచన కూడా బెడిసికొట్టిందని గుర్తుచేస్తున్నారు.
ఈవీఎంలు వద్దు .....
తాము ఇక ఎస్పీ పార్టీ దూరంగా ఉంటామని నేతలకు బెహన్ జీ స్పష్టంచేశారు. దీంతోపాటు పార్టీపరంగా ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించారు. ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించాలని మరోసారి స్పష్టంచేశారు మాయావతి. వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్లు తిరిగి ప్రవేశపెట్టాలని .. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలని మాయావతి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.