మరింత క్షీణించిన ఆరోగ్యం.. ఐసీయూలో ములాయం..
గురుగ్రామ్ : సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మళ్లీ హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం రాత్రి చార్టెడ్ ఫ్లైట్లో గురుగ్రామ్లోని మేదాంత హాస్పటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు.
ములాయం అనారోగ్యం పాలవడంతో ఆదివారం లక్నోలోని లోహియా హాస్పిటల్కు తరలించారు. బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు జ్వరంతో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చారు. చికిత్స అనంతరం కోలుకున్న ములాయంను సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
సోమవారం సాయంత్రం వరకు బాగానే ఉన్న ములాయంకు రాత్రి 8గంటల సమయంలో తీవ్ర జ్వరం వచ్చింది. ఆయనను పరీక్షించిన వైద్యులు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు గుర్తించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే మేదాంత హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ములాయంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యపాలైన విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ సోమవారం స్వయంగా ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ములాయం వెంట ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు సోదరుడు శివ్పాల్ యాదవ్ ఉన్నారు.
ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్