ములాయంపై నితీష్ సంతోషం, బాధ! లాలూకి త్యాగం
పాట్నా: బీహార్లో ఎన్నికల్లో ఎన్డీయే, మహాకూటమిల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. ములాయం సింగ్ నేతృత్వంలోని తృతీయ కూటమి క్రమంగా పుంచుకుంటోంది. ములాయం కూటమి క్రమంగా పుంజుకోవడం మహాకూటమికి ఓ వైపు ఆనందం, మరోవైపు అసహనం అని చెప్పవచ్చు.
ఇటీవలి వరకు ములాయం కూటమి పైన ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, మహాకూటమిలో టిక్కెట్లు రాని పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ములాయం కూటమి వైపుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి కూడా చెప్పుకోదగిన స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే సమయంలో ప్రత్యర్థుల గెలుపోటములను కూడా వీరి బలం నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ములాయం పుంజుకోవడం మహాకూటమికే దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీష్ - లాలూ ప్రసాద్ - కాంగ్రెస్ పార్టీల వైపు ఉన్న ఓటర్లను ములాయం కూటమి చీల్చుతుందంటున్నారు.
అది ఎన్డీయేకు లభ్ది చేకూరేదనని చెబుతున్నారు. మరోవైపు, తృతీయ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే.. అది తిరిగి నితీష్ - లాలూ ప్రసాద్ - కాంగ్రెస్ మహాకూటమిలకే సంతోషం. ఎందుకంటే, ఎన్డీయే లేదా మహాకూటమికి సరైన మెజార్టీ రాకుంటే... ములాయం వీరికే మద్దతిస్తారు. అయితే, గత కొద్ది రోజులుగా వెల్లడవుతున్న సర్వేలు ఎన్డీయే కూటమిదే గెలుపు అని చెబుతున్నాయి.
లాలూకు త్యాగం చేసిన నితీష్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్... లాలూ ప్రసాద్ యాదవ్కు చాలా సీట్లను త్యాగం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2010 ఎన్నికల్లో బీజెపి - జెడీయులు కలిసి పోటీ చేశాయి. నాడు నితీష్ - శరద్ యాదవ్లతో కూడిన జెడియూ 115 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ మాత్రం కేవలం 22 సీట్లలోనే గెలిచింది.
అయితే ఇప్పుడు జెడీయు, ఆర్జేడీలు చెరో 101 సీట్లలో గెలుస్తున్నారు. బీజెపి - జేడీయూ నాటి పాలనతో నితీష్ కుమార్కు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. అదే సమయంలో లాలూ ప్రసాద్కు సొంత సామాజిక వర్గం మద్దతు మినహా పెద్దగా లేదు.
2010 ఎన్నికల్లో జెడీయూ 115 సీట్లు గెలవడం, నితీష్కు మంచి పాలకుడిగా పేరు ఉన్నప్పటికీ, స్కాంలలో ఇరుక్కున్న లాలూతో చేయికలపడం ఆయనకు నష్టం తెచ్చిందనే చెబుతున్నారు. గతంలో కంటే... ఈసారి ఆర్జేడీకి దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా సీట్లు వచ్చాయి.
2010లో ఆర్జేడీ 22 సీట్లు గెలిస్తే, ఇప్పుడు 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆదే సమయంలో 115 స్థానాల్లో గెలిచిన జేడీయూ... పోటీ చేస్తోందే 101 స్థానాల్లో. మరో ట్విస్ట్ ఏమిటంటే... కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు ఇచ్చారు. వాటిల్లో లాలూ సూచించిన లేదా ఆయనకు మద్దతుగా ఉన్న వారే ఎక్కువగా పోటీ చేస్తున్నారు.