ఆ యాదవ కుటుంబంలో ముసలం: మారిన ఈక్వేషన్లు: మాజీ ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బే
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఆ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతోంది.
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లో అధికారంలో బీజేపీ కొంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో పనిచేసిన మంత్రులు రాజీనామాల బాట పట్టారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వవాది పార్టీలో చేరారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు సైతం పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ పరిణామాలన్నీ బీజేపీకి మింగుడు పడట్లేదు.
ఈ ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీకి బిగ్ రిలీఫ్ కలిగించే సందర్భం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆమె దేశ రాజధానిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
Recommended Video
ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య ఆమె. ఉన్నత విద్యావంతురాలు. బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పార్టీలో చేరిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కుటుంబం కంటే దేశానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని అపర్ణ యాదవ్ చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆయన పరిపాలన విధానానికి తాను అభిమానని అన్నారు. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.