మల్లయోధుడిని మట్టికరిపించాడు,ఎంతైనా నా కొడుకే, శివపాల్ కు దారేది?
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూటమి తరపున ప్రచారం నిర్వహిస్తానని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఈ నెల 9వ, తేదినుండి తాను ప్రచారాన్ని చేస్తానన్నారు.
లక్నో :సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో అఖిలేష్ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ములాయం సింగ్ యాదవ్ ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించారు.అయితే ఈ మాట అన్న రెండు రోజులకే ఆయన మాటమార్చారు. తన కొడుకు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని ఆయన ప్రకటించాడు.
సమాజ్ వాదీ పార్టీని ములాయంసింగ్ యాదవ్ నుండి హస్తగతం చేసుకొన్నారు అఖిలేష్ యాదవ్. అయితే ఆనాటి నుండి తండ్రి కొడుకుల మధ్య ఆగాధం నెలకొంది.
కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకొంది.ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 298 అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీచేస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ములాయం సింగ్ వ్యతిరేకించాడు.కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ప్రచారం చేస్తానన్న ములాయం
కొడుకుతో అంటీముట్టనట్టుగా ఉంటున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఒక్క రోజు కొడుకుకు దూరంగా ఉంటున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడు. మరో రోజు కొత్త పార్టీని ఏర్పాటుచేస్తానని సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించాడు.పార్టీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కూడ ఆయన దూరంగా ఉన్నారు.అయితే ములాయం తరహలోనే శివపాల్ కూడ మాట్లాడారు.మరోసారి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తావో చూస్తాను అంటూ శివపాల్ అఖిలేష్ ను సవాల్ చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే అఖిలేష్ తరపున ప్రచారం చేస్తానని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ములాయం ప్రచారం చేస్తానని ప్రకటించడం ఈ కూటమి కలిసొచ్చే అంశంగా మారనుంది.
అఖిలేష్ నా కొడుకు
పార్టీలో నెలకొన్న సంక్షోభంలో తండ్రిపై కొడుకు విజయం సాధించాడు.కొడుకుపై తండ్రి కోపంతో రగిలిపోయాడు.అయితే కొత్త పార్టీని కూడ ఏర్పాటుచేస్తారనే ప్రచారం కూడ ఉంది.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొంది. ఈ కూటమి తరపున తాను ప్రచారం చేస్తున్నట్టుగా ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. అఖిలేష్ ఎంతైనా తన కొడుకు కదా అంటూ ములాయం మీడియాకు వివరించాడు. తన ఆశీస్సులు తన కొడుకుకు ఉంటాయని ఆయన చెప్పాడు.పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన సమయంలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ములాయం సింగ్ తో మ్యానిఫెస్టోను విడుదల చేయించి ఫేస్ బుక్ లో అఖిలేష్ యాదవ్ పోస్టుచేశాడు.తండ్రి ప్రచారం చేయకపోతే తనకు నష్టమని భావించి అఖిలేష్ జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ మేరకు కొడుకు కోసం ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించాడు.
ఫిబ్రవరి రెండో వారంలో ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ కూటమి తరపున ఫిబ్రవరి రెండో వారంలో ప్రచారం చేయనున్నట్టు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఈ నెల 9వ, తేది నుండి ములాయం సింగ్ యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సమాజ్ వాదీ ఎన్నికల ప్రచారాన్ని సుల్తాన్ పూర్ నుండి అఖిలేష్ ప్రారంభించారు.అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీతో కలిసి అఖిలేష్ పాల్గొన్నారు.అయితే ఈ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ పాల్గొనకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ములాయం సింగ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం కూటమికి కలిసివచ్చే అవకాశం.
శివపాల్ కు దారేది
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ పోటీచేస్తున్నాడు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడాయన.అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సభలో అఖిలేష్ కువ్యతిరేకంగా ఆయన ప్రసంగించారు.ములాయంతో కలిసి పార్టీని ఏర్పాటుచేస్తానన్నారు. ములాయం కొడుకు తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడంతో శివపాల్ కు దారేదనే చర్చ సాగుతోంది. ములాయం అడుగు జాడల్లో నడిచే శివపాల్ యాదవ్ కూడ మిన్నకుంటారా...అఖిలేష్ పై ఒంటికాలిపై లేస్తారా అనేది చూడాలి.
అఖిలేష్ చతురత
పార్టీని తన ప్రత్యర్థుల నుండి తన గుప్పిట్లోకి తీసుకొన్న అఖిలేష్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. అంతే కాదు పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పక్కన పెట్టారు. పార్టీకి నష్టం కల్గిస్తున్నారనే కారణంగా అమర్ సింగ్ ను శివపాల్ ను పార్టీ నుండి బహిష్కరించారు.అయితే శివపాల్ కు ఎట్టకేలకు అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చారు.పార్టీ తరపున ప్రచారం చేయబోనని ప్రకటించిన ములాయం సింగ్ ను అఖిలేష్ ఒప్పించారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ కూటమి ఇబ్బంది లేకుండా పోయింది.ఈ వ్యవహరంలో అఖిలేష్ వ్యూహత్మకంగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఆరితేరిన మల్లయోధుడైన ములాయం సింగ్ ను మట్టికరిపించాడు అఖిలేష్.