ఇంధనం లేదు, వాతావరణం సహకరించలేదు..అయినప్పటికీ ఈ పైలట్ సేఫ్గా ల్యాండ్ చేశాడు ఎలా..?
న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ-101 విమానంకు సాంకేతికంగా, సహజంగా అన్ని ఇబ్బందులే ఎదురయ్యాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్కు 15 గంటల సమయం పడుతుంది. విమానం దారి మధ్యలో ఉండగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన సెప్టెంబర్ 11న జరిగింది. అంతేకాదు జాన్ ఎఫ్ కెనెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ ఇండియా విమానం న్యూజెర్సీలోని న్యూఆర్క్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ప్రయణ సమయంలో విమానంలో 370 మంది ప్రయాణికులున్నారు.
ఆటో ల్యాండ్ అందుబాటులో లేదు, విమానంలో పలు సాంకేతిక సమస్యలు
ఆటో ల్యాండ్ అందుబాటులో లేదు, విమానంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి అంటూ విమాన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో మాట్లాడిన మాటలు వినిపించాయి. లైవ్ ఏటీసీ డాట్ నెట్లో ఆడియో ఫైల్స్ దొరికాయి. ఏటీసీకి సంబంధించిన రేడియో ట్రాన్స్మిషన్స్ ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. సమస్య మొత్తం 'ILS'ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ క్లస్టర్తో వచ్చిందని ఏటీసీకి పైలట్లు వివరించారు. ఇది విమానం రన్వేపైకి రావడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు వాతావరణం సరిగ్గా లేకపోతే ILS చాలా కీలకంగా మారుతుంది. ఈ సందర్భంలో కూడా మబ్బులు దట్టంగా కమ్మేయడంతో రన్వే ఎక్కడుందో పైలట్లకు సరిగ్గా కనిపించలేదు. ఈ విమానం గత 9ఏళ్లుగా సేవలందిస్తోంది.
"న్యూయార్క్ ఎయిర్పోర్టులో వాతావరణం సరిగ్గాలేదు. విమానం ల్యాండ్ అయ్యేందుకు సహకరించలేదు. కాక్పిట్లో రేడార్ సిగ్నల్స్ కనిపించలేదు. ఓ వైపు వాతావరణం సరిగ్గా లేదు మరోవైపు రాడార్ సిగ్నల్స్ కనిపించడంలేదు.దీంతో పైలట్ విమానాన్ని చాలా చాకచక్యంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి. అందుకే విమానం దారి మళ్లించి న్యూ ఆర్క్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
వాతావరణం సరిగ్గా లేకుంటే సాంకేతికతపైనే ఆధారం
విమానంలో సాంకేతిక లోపం వస్తేనే చాలా ప్రమాదంగా భావిస్తామని అలాంటిది విమానంలో పలు సాంకేతిక సమస్యలు తెల్లెత్తాయంటే అది ప్రమాద తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు మాజీ ఎయిర్ఇండియా పైలట్. ఒకవేళ విమానం ల్యాండ్ చేయాలంటే రన్వేను కనీసం 2కిలోమీటర్ల దూరం నుంచే వీక్షించే పరిస్థితి పైలట్కు ఉండాలని ఆయన అన్నారు. వాతావరణ పరిస్థితి బాగుంటే విజువల్ ల్యాండింగ్ జరుగుతుందని..లేదంటే సాంకేతికతపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు.కీలక సాంకేతిక వ్యవస్థలో పలు లోపాలు తలెత్తాయంటే ఇది కచ్చితంగా విచారణ చేయాలని ఎయిరిండియా మాజీ పైలట్ అన్నారు.
విమానం దారి మళ్లింపు
లైవ్ఏటీసీడాట్ నెట్ వెబ్సైట్ ప్రకారం ఏటీసీతో జరిపిన సంభాషణల్లో విమానంలో చాలా సమస్యలు తలెత్తాయని.. విమానం ల్యాండ్ అయ్యేందుకు సరైన పరిస్థితులు ఎక్కడున్నాయో చెప్పాలంటూ ఏటీసీ కంట్రోలర్లను అడగడం రికార్డ్ అయ్యాయి. దీంతో వారు న్యూఆర్క్ విమానాశ్రయంను సూచించారు. దీంతో న్యూఆర్క్ విమానాశ్రయంవైపే తాను విమానాన్ని మళ్లిస్తున్నట్లు పైలట్ తెలిపాడు. జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయం కంటే మబ్బులు న్యూఆర్క్ ఎయిర్పోర్ట్ వద్ద తక్కువగా ఉండటంతో పాటు రన్వే కనిపిస్తోందని చెప్పడం అందులో రికార్డ్ అయ్యింది.
ఇంధనం లేదు..అన్నీ సాంకేతిక సమస్యలే అయినా సేఫ్ ల్యాండింగ్
ఇదిలా ఉంటే...విమానంలో సింగిల్ రేడియో ఆల్టిమీటర్ ఉందని,ట్రాఫిక్ కొలిజన్ అండ్ అవాయిడెన్స్ సిస్టం ఫెయిల్యూర్ ఉందని పైలట్ రుస్తుంపాలియా ఏటీసీకి తెలిపారు. ఆటో ల్యాండ్ వ్యవస్థ, విండ్ షీర్ వ్యవస్థ పనిచేయడంలేదని, ఆటో స్పీడ్ బ్రేక్, ఆక్సిలరీ పవర్ యూనిట్ కూడా దెబ్బతిన్నాయని కెప్టెన్ రుస్తుంపాలి చెప్పారు. అంతేకాదు ఇంధనం కూడా తక్కువగా ఉందని ఏటీసీకి తెలిపారు. సాధారణంగా చాలా రేడియో ఆల్టిమీటర్స్ ఉంటాయి. అంతేకాదు ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ వ్యవస్థ చాలా కీలకంగా ఉంటుంది. విమానం ప్రమాదంలో ఉన్నసమయంలో ఈ వ్యవస్థ అలర్ట్ చేస్తుంది. ఎట్టకేలకు పైలట్ల చాకచక్యంతో న్యూఆర్క్ విమానాశ్రయంలో విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యింది. అప్పటికే ఎమర్జెన్సీ సిబ్బందిని రన్వేపై ఉంచారు అధికారులు.
విమానం దారి మళ్లించడం ద్వారా పైలట్ మంచి పనిచేశారని ఓ అధికారి ప్రశంసించారు. ఈ ఘటనపై ఏవియేషన్ సంస్థ విచారణ ప్రారంభించిందని చెప్పారు. సాంకేతిక సమస్యలపై ముందుగా విచారణ చేస్తామన్నారు.