మహిళా సహోద్యోగిపై 4నెలలపాటు ఆప్ కార్యకర్త రేప్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. తన సహోద్యోగి అయిన మహిళపై ఆమ్ ఆద్మీ పార్టీ క్రియాశీల కార్యకర్త ఒకరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు, ఆప్ కార్యకర్త ధర్మేంద్ర ఉమాశంకర్(32) గత నాలుగు నెలలుగా ముంబైలోని భయందర్ ప్రాంతంలో మరో ఆప్ మహిళ కార్యకర్త(35)పై ఈ దారుణానికి పాల్పడ్డాడు.
నిందితుడి నుంచి వచ్చిన బెదిరింపులకు భయపడిన బాధిత మహిళ ఇంతకాలం ఈ విషయాన్ని బయటపెట్టాలి. నిందితుడి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భయందర్ తూర్పు ప్రాంతంలోని అతని అపార్ట్మెంటులో నాలుగు నెలల క్రితం అతని పుట్టిన రోజు పార్టీ జరిగిన సందర్భంగా తొలిసారి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని, ఒక వేళ చెబితే ఆమె భర్తకు లేనిపోనివి చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని ఆమెను ధర్మేంద్ర బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
దీన్ని ఆసరాగా చేసుకున్న ధర్మేంద్ర ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు తాళలేక ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు ధర్మేంద్రను సోమవారం రాత్రి థానే జిల్లాలోని నవఘర్ పట్టణంలో అరెస్ట్ చేశారు.