ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు: టికెట్ ధరలు ఎంతో తెలుసా?
ముంబై: ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలుకు సంబంధించి టికెట్ ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ ఎండీ అచల్ ఖరే ఢిల్లీలో వివరాలు వెల్లడించారు.
ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరలు నిర్ణయించామని, భవిష్యత్తులో మార్పులు ఉంటాయని తెలిపారు. టికెట్ ధరలు రూ.250 కనిష్ట ధరతో మొదలై.. రూ.3000 గరిష్ట ధర వరకు ఉంటాయని చెప్పారు.
ప్రస్తుతం బాంద్రా-కుర్లా స్టేషన్ల మధ్య ట్యాక్సీ ప్రయాణానికి రూ.650తో పాటు గంటన్నర సమయం పడుతోందని, అదే బుల్లెట్ రైలులో ప్రయాణం ద్వారా కేవలం రూ.250కి 15నిమిషాల్లోనే గమ్య స్థానం చేరుకోవచ్చునని తెలిపారు.
బుల్లెట్ రైలు రాకపోకల్లో గరిష్టంగా 40సెకన్లకు మించి ఆలస్యం ఉండదని స్పష్టం చేశారు. గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైలు ప్రయాణిస్తుందన్నారు. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ప్రతీ 20నిమిషాలకు ఒకటి చొప్పున మొత్తం 70 ట్రిప్స్ ఉంటాయని తెలిపారు.
కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న రైల్వే ఏసీ కోచ్ ధరలతో పోలిస్తే.. బుల్లెట్ రైలు ధరలు ఒకటిన్నర శాతం అధికంగా ఉంటాయని వెల్లడించారు. విమానంలో ఉన్నట్టే ఇందులోనూ ఎకనమిక్, బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని, బిజినెస్ క్లాస్ టికెట్ రూ.3000కి పైనే ఉంటుందన్నారు.
మొత్తం 10కోచ్ లు ఉండే ఈ రైల్లో ఒక బిజినెస్ క్లాస్ కోచ్ ఉంటుందన్నారు. ఇందులో ప్రయాణించేవారికి ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుందన్నారు. 2023నాటికి బుల్లెట్ ట్రైన్ పూర్తి స్థాయి సేవలను ప్రారంభిస్తుందని రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వని లొహాని తెలిపారు.