ముంబై విమానాశ్రయం రన్వే మూసివేత...పలు విమానాలకు అంతరాయం
ముంబై: ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే లేదా అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కొన్ని గంటల పాటు ఇబ్బందులు తప్పదు. ఎందుకంటే ముంబై విమానాశ్రయంలోని ప్రదాన రన్వేతో పాటు మరో రన్వేను కూడా అధికారులు మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి రన్వే పై మరమత్తులు జరుగనుండటంతో అధికారులు ఈ ప్రకటన చేశారు. ఆరుగంటల పాటు అక్కడ పనులు జరిగే అవకాశం ఉన్నందున ఇబ్బందులు తప్పవని తెలిపారు. దీంతో చాలా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతి ఏటా ఫిబ్రవరి-మార్చి, అక్టోబర్ నెలల్లో రన్వే మెయిన్టెనెన్స్ మరమత్తులు చేస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం ఎయిర్పోర్ట్ రన్వే మూతపడనుంది.
జరభద్రం: కర్నూలు అనంతపురంలో స్వైన్ ఫ్లూ రాకాసి..ఇద్దరు మృతి
రన్వే ఆరుగంటల పాటు మూత పడనుండటంతో ఒక్క మంగళవారం రోజునే దాదాపు 300 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్వేను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఎయిర్ఇండియా విమానాల రాకపోకల వివరాలకు సంబంధించిన సమాచారం ఎయిర్ ఇండియా వెబ్సైట్లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు. రద్దు అయిన విమానాల సమాచారం, తిరిగి టేకాఫ్ తీసుకునే సమాచారం మొత్తం వెబ్సైట్ లేదా యాప్లో పొందుపర్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర ప్రైవేట్ విమానాలు కూడా రద్దు అయ్యాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే రన్వే 09/27, 14/32 రన్వేలు అక్టోబర్ 23న మరమత్తుల కారణంగా మూసివేయనున్నట్లు అక్టోబర్ 4నే ప్రకటన చేసినట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సంస్థ వెల్లడించింది. ఇక రెండో దశలో రన్వేపై మరమత్తులు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
అయితే ఇవి కేవలం మంగళవారాలు, గురువారాలు, శనివారాల్లో మాత్రమే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమత్తులు కొనసాగుతాయని ఆసమయంలో రన్వేలను మూసివేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రాథమిక రన్వేపై గంటకు 50 విమానాల రాకపోకలు జరుగుతాయని సెకండరీ రన్వేపై గంటకు 35 విమానాల రాకపోకలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇక రోజుకు సగటున 1000 విమానాలు రాకపోకలు సాగిస్తాయి.