ఈదురుగాలి బీభత్సం: స్పైస్ జెట్ నిచ్చెన.. ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.. రెక్కలు, ఇంజిన్ ధ్వంసం
ముంబై: బలమైన ఈదురుగాలులు ముంబై విమానాశ్రయంలో స్వల్ప బీభత్సమే సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగావిమానాశ్రయంలోని స్పైస్ జెట్ విమానం నిచ్చెన సమీపంలో ఆగివున్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం రెక్కలు, ఇంజిన్ను కప్పివుంచే భాగం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
శనివారం ఉదయం వీచిన బలమైన ఈదురుగాలు, భారీ వర్షంతో ముంబై నగరం జలమయమైంది. ఈ క్రమంలోనే ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో నిచ్చెన విమానాన్ని ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది.
బలమైన గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి రావడంతో ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు మీడియాల్లో వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో రెండు విమానాలు కూడా విమానాశ్రయంలోనే నిలిపివున్నాయని స్పైస్ జెట్ తెలిపింది.
Maharashtra: Due to strong winds today, an IndiGo aircraft was hit by a ladder of SpiceJet at Mumbai Airport, leading to some damage to wings & engine cowling of the aircraft. pic.twitter.com/4Epr3VGkr4
— ANI (@ANI) June 6, 2020
ఆ తర్వాత నిచ్చెనను ఇండిగో విమానం నుంచి వేరు చేశారు అధికారులు. ఘటనకు సంబంధించిన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇండిగో విమానానికి అవసరమైన మరమ్మతులు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.