కమలనాథుల్లో జోష్ మొదలు: పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం: దీపావళి ముందే వచ్చిందంటూ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి కొన్ని గంటల ముందు నుంచే భారతీయ జనతపార్టీ-శివసేన కూటమి నాయకులు ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నారు. భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఈ రెండు పార్టీల నేతలు విజయోత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సీట్ల సంఖ్య కంటే కూడా అధిక స్థానాలను తాము గెలుచుకుంటామనే అభిప్రాయం బీజేపీ-శివసేన నేతల్లో కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో తాము ముందస్తు దీపావళిని జరుపుకొంటున్నామని అంటున్నారు.
బారులు తీరిన కార్యకర్తలు..
భారతీయ జనతాపార్టీ, శివసేన పార్టీ ప్రధాన కార్యాలయాల్లో పండగ వాతావరణం నెలకొంది. గురువారం తెల్లవారు జాము నుంచే ఈ రెండు పార్టీ కార్యాలయాలు సందడిగా మారిపోయాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. కాషాయ దుస్తులు, అదే రంగు గాంధీ టోపీలను ధరించి పార్టీ కార్యాలయాల్లో కనిపిస్తున్నారు. నారీమన్ పాయింట్ లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి దారి తీసే మార్గాలన్నీ కాషాయమయం అయ్యాయి. రోడ్డుకు ఇరు వైపులా బీజేపీ జెండాలను ఎగుర వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సహా మిగిలిన నాయకులకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లను కట్టారు.
ఫలితాల వెల్లడి తరువాత విజయోత్సవ ర్యాలీ..
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ముంబైలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించబోతున్నామని బీజేపీ-శివసేన నాయకులు వెల్లడించారు. ప్రధాన కార్యాలయం నుంచి సాగే ఈ ర్యాలీలో దేవేంద్ర ఫడణవిస్ సహా పలువురు నాయకులు పాల్గొంటారని బీజేపీ పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మెజారిటీ స్థానాలు తమ కూటమికే దక్కడం ఖాయమైనందు వల్లే ముందస్తు దీపావళిని జరుపుకొంటున్నామంటూ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి. దేవేంద్ర ఫడణవిస్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ తమను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాబోతోందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్టీ కార్యాలయంలో భారీ స్క్రీన్
ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బీజేపీ నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, నవీ ముంబై, పొరుగునే ఉన్న థానే జిల్లాల్లోని పార్టీ అసెంబ్లీ కార్యాలయాల్లో కూడా ఓట్ల లెక్కింపును వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆయా చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. విజయోత్సవ ర్యాలీ కోసం బాణాసంచాను సిద్ధం చేసుకున్నారు. తాము గెలవడం ఖాయమని, మెజారిటీ ఎంత అనే విషయంపైనే దృష్టి పెట్టామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు.
వరుసగా రెండోసారి అధికారం వైపు?
మహారాష్ట్ర, హర్యానాలల్లో భారతీయ జనతాపార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానకే అధిక అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే పార్టీతో కలిసి తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. బీజేపీ-164, శివసేన-124, కాంగ్రెస్-125, ఎన్సీపీ-125 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల సత్తా ఏమిటో మరి కాస్సేపట్లో వెల్లడవుతుంది. కాంగ్రెస్ తరఫున ప్రధాన ప్రచారకర్తగా రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అయిదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.