లాల్ బౌగ్చా రాజా గణపతికి రూ.4.86లక్షల జరిమానా: ఎందుకంటే..?
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్ బౌగ్చా రాజా గణపతికి చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్ బౌగ్చా రాజా గణపతికి చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. ఇది ఇలావుంటే.. లాల్ బౌగ్చా రాజా గణపతి మండపానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీసీఎం) రూ.4.86లక్షల జరిమానా విధించింది.
ఎందుకంటే.. ఈ మండపం కారణంగా రోడ్డుపై 200లకు పైగా గుంతలు ఏర్పడటంతో ఈ మేరకు జరిమానా విధించినట్లు బీఎంసీ చెప్పుకొచ్చింది. 'భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, లాల్ బౌగ్చా మండలం నిర్మాణం కోసం రహదారిపై 243 గుంతలు తవ్వారు. రోడ్డు బాగా ధ్వంసమైంది. దీంతో ఈ మండపానికి రూ.4.86లక్షల జరిమానా విధించాం' అని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, మండపం వారు డబ్బు కట్టేంత వరకూ వేచి చూడకుండా ఇప్పటికే రోడ్డు మరమ్మతులు చేపట్టామని చెప్పారు. కాగా, గత సంవత్సరం కూడా ఇలా జరిమానా విధించారు. గత సంవత్సరం లాల్ బౌగ్చా గణపతి మండపానికి రూ.4.5లక్షల జరిమానా విధించగా.. ఈసారి గుంతకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.4.8లక్షల జరిమానా విధించారు.
కాగా, లాల్ బౌగ్చా గణపతి మండప అధ్యక్షుడు బాలసాహెబ్ కంబ్లే మాట్లాడుతూ.. జరిమానా గురించి తమకు ఇంతవరకూ ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. మండపం కారణంగా 200లకుపైగా గుంతలు ఏర్పడటం అసాధ్యమని తెలిపారు. అంతేగాక, మండపాన్ని కూడా నేల మీదే ఏర్పాటు చేశామని, గుంతలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కాగా, కాగా, లాల్ బౌగ్చా మండపంతోపాటు నగరంలోని మరికొన్ని మండపాలకు కూడా జరిమానా విధించడం గమనార్హం.