తప్పిన పెనుప్రమాదం: స్కిడ్డైన విమానం, గోవా ఎయిర్పోర్ట్ మూసివేత
పనాజీ: గోవా విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్ ఎయిర్ 9W 2374 విమానం డబ్లిమ్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు అరుపులుకేకలతో భయాందోళనలకు గురయ్యారు.
అయితే, అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఎలాంటి దుర్ఘటన జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. జెట్ ఎయిర్వేస్ విమానంలో 161 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
Visuals of passengers,who sustained minor injuries,being taken fr treatment aftr Jet Airways flight 9W2374 skidded off runway at Goa airport pic.twitter.com/bMHZbhPL5M
— ANI (@ANI_news) 27 December 2016
ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ నుంచి సురక్షితంగా తరలించే క్రమంలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెట్ ఎయిర్ వేస్ బృందంతో పాటు ఎయిర్ పోర్టు అధికారులు ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల వరకూ గోవా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం రన్ వేపై పక్కకు ఒరిగిందని ప్రాథమికంగా తెలిసింది.