ముంబై బ్రిడ్జి ప్రమాదం: బీజేపీ నేత సంజు వర్మ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 30 మంది వరకు గాయపడ్డారు. ఈ అంశంపై భాజపా అధికార ప్రతినిధి సంజు వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, సహజంగా జరిగిన విపత్తు అన్నారు. అంతేకాదు, దీనికి పాదచారులను బాధ్యులను చేస్తూ, వారి బ్యాడ్లక్ అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలు చనిపోయినా వారిదే బాధ్యత అని చెప్పడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఆమె పాదచారులను తప్పుపడుతోందని, ఎవరైనా ఆమె నోరు మూయించండని మరో నెటిజన్ ఆగ్రహించారు. సిగ్గుపడాల్సిన కామెంట్స్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను వెంటనే తొలగించాలని మరొకరు డిమాండ్ చేశారు.
ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు
కాగా, ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పరిశీలించారు. అనంతరం ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్పపొందుతున్న బాధితుల వద్దకు వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్లర్లను అడిగి తెలుసుకున్నారు.
గాయాలైన వారిలో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరు ఐసీయూలో ఉన్నారని ఫడ్నవీస్ తెలిపారు. మెరుగైన వైద్యం అందించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 30 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.