స్లాబ్తో కూలిన తల్లి, కుమారులు.. సిమెంట్ పెళ్లలు, ఇనుపరాడ్ల కింద నరకయాతన...
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భవనం కూల్చివేత మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. డోంగ్రిలో గల భవనం కుప్పకూలిపోవడంతో .. అందులో ఉన్న వారు విగతజీవులుగా మారారు. సిమెంట్ పెళ్లలు పడి, ఇనపరాడ్లు పడి 18 గంటలు మృత్యువుతో పోరాడింది ఓ వనిత. ఆమె ప్రాణాలు నిలిచాయి. కానీ పేగుతెంచుకొని పుట్టిన ఇద్దరు కుమారులు కళ్లముందే హాహాకారాలు చేశారు. వారిని కాపాడలేని దుస్థితి, ఇటు సహాయక చర్యలు అందకపోవడంతో ఇద్దరూ చనిపోయారు.
చిన్నాభిన్నం ..
డోంగ్రిలోని భవనంలో రషీద్ ఉంటున్నారు. ఆయన స్వస్థలం యూపీలోని గోండా జిల్లా. ఆయనకు భార్య అలిమా, ఇద్దరు కుమారులు షాజాద్ (7), హర్బజ్ (4) ఉన్నారు. ముంబైలో రషీద్ టైలరింగ్ చేస్తుంటాడు. అయితే ఇటీవల తండ్రిని కలిసేందుకు పిల్లలు ముంబై వచ్చారు. అంతే వారిని ప్రమాదం మృత్యురూపంలో కబలించింది. బిల్డింగ్ కూలడంతో శిథిలాల కింద అలిమా చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. 18 గంటల తర్వాత ఎలాగోలా అలిమాను కాపాడారు. కానీ వారిద్దరూ కుమారులు మాత్రం శిథిలాల కింద చిక్కుకొన్నారు. సహాయక చర్యలు ఆలస్యమై ఊపరొదిలారు.
గడిపేందుకు వస్తే ..
తమ తండ్రితో కొన్నాళ్లు ఉంటామని కుమారులు వచ్చారని అలిమా గద్గతస్వరంతో రోదిస్తూ మీడియాకు వివరించారు. జూలై తర్వాత స్వస్థలానికి వెళ్లిపోవాలనుకున్నామని .. కానీ ఇంతలో విధి తమను ఇలా చేసిందని రోదించారు. తమ ఇద్దరు కుమారుల మృతి తమను తీవ్రంగా కలచివేసిందని గుర్తుచేశారు. కళ్ల ముందే చిన్నారులు ఉన్నా .. కాపాడలేని పరిస్థితి తనదని గుర్తుచేశారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తాను కిచెన్లో ఉన్నానని .. ఆ సమయంలో ఇళ్లు కదులుతూ .. క్రమంగా కుంగిపోయిందని వివరించారు. దీంతో మెల్లగా కుప్పకూలి .. ఒక్కసారిగా దుమ్ము లేచిందని తెలిపారు. తాను ఉన్న స్లాబ్ కూడా కుప్పకూలిపోయిందని .. ఆ సమయంలో తన కుమారులు ప్రమాదం దృష్ట్యా ఒక్కసారిగా ఏడ్చారని పేర్కొన్నారు.
కూలిన స్వప్న సౌధం ..
కాసేపటి ఇంటికొచ్చిన రషీద్ కూలిపోయిది చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తన భార్య అలిమాను పిలిచారు. తన ఫోన్కు ట్రై చేస్తుండగా కవరేజ్ ఏరియాల లేదని వస్తోంది. వెంటనే జేజే హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులను చూసేందుకు వెళ్లాడు. కానీ ప్రయోజనం లేదు. తెల్లవారి అలిమా, అతని కుమారులను సహాయక సిబ్బంది గుర్తించారు. దాదాపు 18 గంటల పాటు కుమారులతో ఉన్న అలిమా .. నాన్న వస్తాడు, కాపాడుతాడని చెప్పింది. నాన్న వచ్చారు కానీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. సహాయక సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ అలిమా ఒక్కరే ప్రాణంతో ఉండగా .. ఇద్దరు కుమారులు చనిపోయారు. అలిమాకు తల, చేతులపై గాయాలయ్యాయి. ఆదివారం జుహు బీచ్కు తమ కుమారులను పిక్నిక్ తీసుకెళ్లామని .. రెండురోజులకే విధి కబళించిందని అలిమా వాపోయారు. తన కుటుంబానికి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని బోరుమని విలపించారు.