ముందు రైలు: క్షణాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసు, నిర్లక్ష్యానికి కోపగించి చెంప ఛెళ్లుమనించాడు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్లో ఓ 60 ఏళ్ల పెద్ద మనిషిని రక్షించాడు అక్కడేవున్న పోలీసు. ఆ తర్వాత వృద్ధుడి నిర్లక్ష్యానికి కోపగించిన ఆ పోలీసు.. అతడి చెంపమీద ఒక్కటిచ్చాడు. శుక్రవారంనాడు చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. గణపత్ సోలంకి అనే 60ఏళ్ల వృద్ధుడు రైల్వే పట్టాలమీదకు వెళ్లాడు. అతనికి సంబంధించినది ఏదో కొందపడితే తెచ్చుకున్నాడు. అయితే, అటుగా వస్తున్న రైలును గమనించలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే ప్లాట్ ఫాంపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. చెప్పు ఊడిపోవడంతో దాన్ని తీసుకొచ్చి ఫ్లాట్ఫాంపైకి ఎక్కుతుండగానే రైలు వచ్చేంది.
వెంటనే గమనించిన ఎస్బీ నికమ్ అనే పోలీస్ కానిస్టేబుల్ అతడ్ని పైకిలాగాడు. ఇద్దరూ కూడా ప్లాట్ ఫాంపై పడిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అయితే, రైలు వస్తుంది.. అటువైపే ఉండుమని చెప్పినా వినకుండా ప్లాట్ ఫాంపైకి వచ్చినందుకు ఆ వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసు చర్యను చాలా మంది సమర్థించారు. మరికొందరు చేయి చేసుకోకుండా చెబితే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా.. అతని ప్రాణాలు మాత్రం కాపాడిన సదరు పోలీసును అభినందించాల్సిందే.