కరోనా విలయం: ఆస్పత్రిలో అత్యాచారం.. మగ పేషెంట్పై డాక్టర్ అకృత్యం.. వైరస్ భయంతో నో అరెస్ట్..
ఆలయాలు, మసీదులు, చర్చిలన్నీ మూతపడిన కరోనా విలయకాలంలో ప్రజలందరికీ డాక్టర్లే దేవుళ్లయ్యారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిని దేశం 'కరోనా వారియర్స్'గా గుర్తించి, సముచితంగా గౌరవించుకుంటున్నవేళ అనూహ్య సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నూమిన్నూ కానని ఓ కామోన్మాద డాక్టర్.. కరోనా వార్డులో చికిత్స పొందుతోన్న పేషెంట్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం తర్వాత కూడా వైరస్ సోకుతుందనే భయంతో పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేయలేకపోయారు. కరోనా విలయానికి సంబంధించిన భిన్నకోణాల్ని చర్చకు పెట్టిన ఈ ఘటనపై పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...
అది ఫేమస్ చైన్ ఆస్పత్రి..
కొవిడ్-19 రోగిపై లైంగికదాడి ఘటన.. కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీగా, దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోనే ఐదో అతిపెద్ద హెల్త్ కేర్ సంస్థగా పేరుపొందిన వకార్డ్ ఆస్పత్రికి చాలా చోట్ల బ్రాంచ్ లు ఉన్నాయి. సౌత్ ముంబైలోని అగ్రిపద పోలీస్ స్టేషన్ పరిధిలోని వకార్డ్ ఆస్పల్రిలో ఈ దురాగతం జరిగింది. ఆస్పత్రి 10వ అంతస్తులో కొవిడ్-19 ఐసీయూ వార్డు ఉంది. అక్కడ చికిత్స పొందుతోన్న మగ పేషెంట్ పై గత శుక్రవారం(మే 1న) లైంగికదాడి జరిగినట్లు ఆస్పత్రి యాజమాన్యమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ట్రీట్మెట్ పేరుతో తాకుతూ..
సాధారణంగా కొవిడ్-19 రోగులకు పరీక్షలు నిర్వహించేటప్పుడు డాక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఈ కామాంధుడు మాత్రం పీపీఈ, గ్లౌజ్, మాస్కుల్ని పక్కన పెట్టేసిమరీ అకృత్యానికి పాల్పడ్డాడు. ట్రీట్మెంట్ లో భాగమంటూ మగ పేషెంట్ ప్రవేటు భాగాలను తాకుతూ ఐసీయూ బెడ్ పైనే వికృతచర్యకుదిగాడు. పట్టరాని నొప్పితో ఆ పేషెంట్ గట్టిగా అరవడానికి ప్రయత్నించడంతో డాక్టర్ నోరు మూసే ప్రయత్నం చేశాడు. ఎలాగోలా పేషెంట్ కేకలు వేయడంతో బయటి పరుగున వచ్చిన నర్సు.. ఆ సీన్ చూసి షాక్ తినింది. వెంటనే ఇతర డాక్టర్లు, యాజమాన్యానికి సమాచారం అందించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ..
ఎవరా డాక్టర్? ఎందుకిలా?
దేశంలోనే అత్యధిక కొవిడ్-19 కేసులు ముంబైలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఒక దశలో పరిస్థితి భయానకంగా మారడంతో అత్యవసర సేవల విభాగమైన పోలీస్ శాఖ.. 55 ఏళ్లు పైబడిన సిబ్బందిని బలవంతపు సెలవులపై పంపింది. అలాగే, కొన్ని ఆస్పత్రులు కూడా 60 ఏళ్లు పైబడిన డాక్టర్లను డ్యూటీలకు దూరంగా ఉంచారు. డాక్టర్ల కొరత రాకుండా తాత్కాలిక రిక్రూట్మెంట్లు చేపట్టారు. ఎమర్జెన్సీ చేరికలు కావడంతో సదరు డాక్టర్ల బ్యాడ్రౌంట్ చేయకుండానే వకార్డ్ ఆస్పత్రి కొందరు డాక్టర్లను అపాయింట్ చేసుకుంది. అలా ఓ 34 ఏళ్ల యువ వైద్యుడు ఏప్రిల్ 30న డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అతను నవీ ముంబై మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తిచేసినట్లు సర్టిఫికేట్లు చూపాడని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
సీజ్ చేసిన ఆస్పత్రిని తెరిచారు..
కీచక డాక్టర్ వకార్డ్ ఆస్పత్రిలో చేరినరోజే బాధిత పేషెంట్ కూడా అడ్మిట్ అయ్యాడు. డ్యూటీ నిర్వహించిన తొలిరోజే ఆ డాక్టర్ దురాగతానికి పాల్పడ్డాడు. నిజానికి అగ్రిపదలోని వకార్డ్ ఆస్పత్రిలో 80 మంది సిబ్బందికి వైరస్ సోకడంతో కొన్నాళ్లపాటు సీజ్ చేశారు. తిరిగి ఏప్రిల్ 23న ఆస్పత్రిని రీఓపెన్ చేశారు. అప్పటికే 60 ఏళ్లు దాటిన డాక్టర్లు విధులకు దూరంగా ఉండటంతో కొత్తవాళ్లను నియమించుకున్నారు. కాగా, కొవిడ్-19 పేషెంట్ పై అత్యాచారం జరిపిన డాక్టర్ కు కూడా వైరస్ సోకి ఉంటుందేమోనని పోలీసులు అనుమానించారు. దీంతో..
కేసు పెట్టి క్వారంటైన్ కు పంపారు..
వకార్డ్ ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు.. యువ డాక్టర్ పై ఐసీపీలోని 377(అసహజ లైంగికదాడి), 269(ఉద్దేశపూరితంగా వైరస్ వ్యాపింపజేసే కుట్ర), 270(ప్రాణాంతక చర్య) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైరస్ వ్యాప్తి భయంతో నిందితుణ్ని అరెస్టు చేయకుండా, థానేలోని అతని అపార్ట్ మెట్ లోనే హోం క్వారంటైన్ లో ఉంచారు.
ముంబైలో కరోనా విలయం..
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 46వేలు దాటగా, అందులో మెజార్టీ కేసులు మహారాష్ట్ర నుంచే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో మంగళవారం నాటికి 14,541 పాజిటివ్ కేసులు రాగా, ఒక్క ముంబై సిటీలోనే 9,123 మంది వైరస్ కాటుకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 583 మంది ప్రాణాలు కోల్పోతే, అందులోనూ ముంబైకర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో సిటీ అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.