బీమాండి టవర్స్లో భారీ అగ్ని ప్రమాదం: ఆ అపార్ట్మెంట్లోనే నటి దీపిక
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో బీమాండీ టవర్స్లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 45అంతస్తులు గల ఈ భవనంలో 33వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ప్రమాదంలో భవనంలోని పై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. తొలుత లెవల్ 2గా ఉన్న ప్రమాదం.. ఆ తర్వాత లెవల్ 3గా మారింది. 10 ఫైరింజన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, 2 హైడ్రాలిక్ ప్లాట్ఫాంలు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి.
సహాయక సిబ్బంది 95మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, ఈ భవనంలోని 33వ అంతస్తులో 4బెడ్ రూం ఫ్లాట్ను రూ. 16కోట్లతో కొనుగోలు చేశారు దీపిక. తండ్రి ప్రకాశ్ పదుకొనెతోపాటు దీపిక ఇక్కడే ఉంటున్నారు.