జీఎస్టీ భవన్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన 16 ఫైరింజిన్లు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిన మంటలను ఆర్పేందుకు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మజగావ్ ప్రాంతంలోని జీఎస్టీ కార్యాలయం 8వ అంతస్తులో సోమవారం మధ్యాహ్నం 12.42 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
ముంబైలో ఉన్న ఈ 9 అంతస్తుల భవనానని గతంలో సేల్స్ టాక్స్ కార్యాలయంగా పిలిచేవారు. కేంద్రం వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి తెచ్చిన నాటి నుంచి ఈ భవనాన్ని జీఎస్టీ కార్యాలయంగా పిలుస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.