మునకేసిన ముంబై: 200 సంవత్సరాల తరువాత తొలిసారి! నాలుగు రోజుల్లో 499 మిల్లీమీటర్లు
Recommended Video
ముంబై: మునకేయడం అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇస్తోంది దేశ ఆర్థిక రాజధాని ముంబై. ప్రస్తుత వర్షాకాలం సెకెండ్ ఇన్నింగ్ లో కురిసిన భారీ వర్షాలకు ఈ మహానగరం పావుభాగం మునిగింది. అంతపెద్ద ముంబై నగరంలో వర్షపు నీరు నిల్వ ఉండని ప్రాంతం ఒక్కటీ లేదంటే వాటి తీవ్రత ఏ స్థాయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 200 సంవత్సరాల తరువాత ఈ రేంజ్ లో వర్షం పడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ శాఖ నమోదు చేసిన రికార్డుల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు 499 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క ముంబై మహానగరంలో కురిసింది. శివారు ప్రాంతాలు, పొరుగునే ఉన్న థానే జిల్లాల్లో కురిసిన వర్షపాతాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
అన్ని ప్రాంతాల్లో వర్షపునీరు..
ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఆరంభమైన వర్షాకాలం నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ముంబైలో కురిసిన వర్షం 3000 మిల్లీమీటర్ల ల్యాండ్ మార్క్ ను అధిగమించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రామ్ మందిర్, అంధేరి, శాంటాక్రజ్, కండీవలి, కింగ్ సర్కిల్, ఘన్సోలి, బాంద్రా, భండూప్, గోరేగావ్, బొరివలి, బేలాపూర్, లాల్ బాగ్, మలద్, బైకుల్లా, నాలాసపోరా, విల్లేపార్లె, దాదర్, సియోన్, వాడాలా రోడ్.. ఇలా ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేని భారీ వర్షం కుదిపి పడేసింది. శాంటాక్రజ్ లో అత్యధికంగా 206 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ముంబైలోని ప్రతిచోట కూడా రెండడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. వర్షపు నీటిని తోడేయడానికి చేస్తోన్న ప్రయత్నాలన్నీ వృధాగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి స్తంభించిపోయాయి.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు
బరాబర్ మునిగిన సబర్బన్..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముంబై నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రహదారులపై మోకాలి లోతు వరకు వరద నీరు చేరింది. ముంబై ప్రజారవాణాకు గుండెకాయగా చెప్పుకొనే సబర్బన్ రైల్వే స్టేషన్లను వర్షపు నీరు ముంచెత్తుతోంది. పట్టాలపై రెండడుగుల మేర ఎత్తు వర్షపు నీళ్లు ప్రవహిస్తుండటంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా 1916 నంబర్ తో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అధికారులు జారీ చేసిన 24 గంటల రెడ్ అలర్ట్ ఇంకా కొనసాగుతోంది. మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ముంబై వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హొసలికర్ తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ హైలర్ట్
భారీ వర్షాల వల్ల ముంబైలో ఎప్పుడు, ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయో తెలియని అయోమయం నెలకొంది. ఫలితంగా- నగరం వ్యాప్తంగా జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలను మోహరింపజేశారు. దాదాపు అయిదడగుల మేర వర్షపు నీరు నిలిచిన కుర్లాలోని బైల్ బజార్, క్రాంతినగర్ నుంచి 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే మిట్టీ నదిలో ఎప్పుడూ లేనివిధంగా వరద నీరు ప్రవహిస్తోంది. అసలు ఇక్కడ ఇలాంటి నది ఒకటుందనే విషయాన్ని ఎప్పుడో మరచేపోయామని, అలాంటి నది ఇప్పుడు వరద ప్రవాహంతో పొంగిపోర్లుతోందని స్థానికులు చెబుతున్నారు. సమీపంలోని సియోన్ రైల్వేస్టేషన్ పూర్తిగా నీటిలో మునిగింది. ప్లాట్ ఫాం పైకి వర్షపునీరు చేరుకుంది.
విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం..
సాధారణంగా ప్రయాణికులు.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో కునుకు తీస్తూ కనిపిస్తుంటారు. తాము అందుకోవాల్సిన రైళ్లు గానీ, బస్సులు గానీ సకాలంలో రాకపోతే.. దుప్పట్లు కప్పుకుని అక్కడే తిష్ట వేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ కనిపించడం ప్రత్యేకం. వర్షాల వల్ల ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు విమానాశ్రయం ఆవరణలోనే నిద్రించడం కనిపించింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే కునుకు తీశారు.