ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. 30 విమానాలు రద్దు..!
ముంబై : మహారాష్ట్రను వరద ముంచెత్తుతోంది. వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైతో పాటు పలు చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. గురువారం నాడు కూడా భారీ వర్షాలు పడే ఛాన్సుందని తెలిపారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఆ క్రమంలో ముంబైలో బుధవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆ తర్వాత గురువారం నాడు ఉదయమే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముంబై వాసులు అప్రమత్తమయ్యారు. అటు అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించి పోయింది. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలో పరిస్థితి దారుణంగా తయారైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ముంబై అస్తవ్యస్థంగా మారింది. ఆ క్రమంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అంతేకాదు అటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అక్కడేమో స్టార్.. ఇక్కడేమో దొంగతనాలు..!
అదలావుంటే భారీ వర్షాలు, వరదల కారణంగా ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పాల్ఘర్ జిల్లాలో ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. విద్యుత్ సప్లై నిలిచి పోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో మగ్గుతూ పడరాని కష్టాలు పడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా దాదాపు 30 విమానాల రాకపోకలు రద్దయినట్లు తెలుస్తోంది. అంతేకాదు వందల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. అటు రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా.. సబర్బన్ సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అదలావుంటే ముంబై, పాల్ఘర్, రాయ్గఢ్, థానే లాంటి ప్రాంతాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని ఐఎండీ తెలిపింది.