ముంబైలో భారీ వర్షాలు: నిలిచిపోయిన మహాలక్షీ ఎక్స్ప్రెస్..రైల్లో 2వేల మంది ప్రయాణికులు
Recommended Video
ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ఎటు చూసిన వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో సముద్రం నడిరోడ్డుపైకి వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉంటే వారాంతంలో ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చిరించింది.
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో... ఆ వర్షపు నీరు ప్రధాన రహదారులపై నిలిచిపోయింది.దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లకు చేరుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో లోకల్ ట్రైన్స్ను అధికారులు నిలిపివేశారు. ఇక భారీ వర్షాలతో పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. మొత్తం మీద 11 విమానాలను ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో ముంబై నగరంలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే జరిగితే అక్కడి సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
నిలిచిపోయిన మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్.. రైలులో 2వేల మంది ప్రయాణికులు
ఇక భారీ వర్షాలకు పలు రైళ్లు నిలిచిపోయాయి. బదల్పూర్ నుంచి వాంగానీ మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్ప్రెస్ రైలు ముంబై నగరం అవతల నిలిచిపోయింది. వర్షపు నీరు ట్రాక్పైకి వచ్చేయడంతో ట్రాక్ కనిపించడం లేదు. ఆ రైలులో 2వేల మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని 8 బోట్లలో ప్రయాణికులను తరలించే కార్యక్రమం చేస్తున్నారు. రైలు నిలిచిపోయిన చోట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సిటీ పోలీసులు ఉన్నారు. ప్రయాణికులకు బిస్కెట్లు, నీళ్లు అందజేస్తున్నారు.
రైల్లో ప్రయాణికులకు సూచనలు చేసిన అధికారులు
ఇదిలా ఉంటే ప్రయాణికులంతా రైల్లోనే ఉండాలని దిగి వెళ్లేందుకు ప్రయత్నం చేయకూడదని రైల్వే అధికారులు హెచ్చరించారు. రైలు సురక్షిత ప్రాంతంలోనే ఉందని అధికారులు తెలిపారు. తమ క్షేమం కోసం రైల్వే పోలీసులు సిటీ పోలీసులు ఉన్నారని వారు సహాయం చేస్తారని అధికారులు ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు అంతా రైల్లోనే ఉండాలని సూచించారు. రైలు మెట్లు వరకు నీరు చేరింది.
2005 జూలై 26న ఇలాంటి పరిస్థితే...
ఇదిలా ఉంటే శుక్రవారం నుంచే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు నగరవాసులు 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజు కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం నీటిపాలైందని చెబుతూ నాటి చేదు జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ వేదికగా పోస్టు చేస్తున్నారు ముంబై నగరవాసులు. ముంబైను దేవుడే కాపాడాలంటూ నగరవాసులు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ముంబై నగరంలో భారీ వర్షాలు శనివారం సాయంత్రం నుంచి తగ్గే అవకాశం ఉందని ఓ ప్రైవేట్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.