కరెన్సీ నోట్లపై తీసేద్దాం .. విగ్రహాలు తొలగిద్దాం ... గాంధీపై ఐఏఎస్ వివాదాస్పద ట్వీట్లు, బదిలీ
ముంబై : జాతి పిత మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సివిల్ సర్వెంట్పై బదిలీ వేటు పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ పేరును స్మరిస్తూ .. నగదు, రోడ్లు విద్యాసంస్థలకు గౌరవప్రదంగా ఆయన పేరు పెట్టుకున్నాం. కానీ దానిని ఆ తెలివిగల ఐఏఎస్ తప్పుపట్టింది. అంతేకాదు సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో .. మహారాష్ట్ర సర్కార్ ట్రాన్స్ఫర్ కొరఢా ఝులిపించింది.
నిది చౌదరి తలపొగరు ..
నిది చౌదరి .. ఐఏఎస్ అధికారి. ముంబై మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. తాను అధికారి అని పొగరో .. లేదా చదువు ఎక్కువైందో తెలియదు కానీ గత నెల 17న గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మాగాంధీ 150వ జయంతి వస్తోన్న నేపథ్యంలో మనంతా కొత్తగా ఆలోచించాలని సెలవిచ్చింది. దేశంలో ఉన్న కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలని పేర్కొంది. దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న గాంధీ విగ్రహాలను తీసేయాలని పురామయించింది. గాంధీ పేరుతో ఉన్న రోడ్లు, విద్యాసంస్థల పేర్లను మార్చాలని సెలవిచ్చింది. ఇలా చేయడమే మనం గాంధీకిచ్చే నిజమైన గౌరవమని పేర్కొంది. అంతేకాదు గాంధీని చంపిన గాడ్సేకు ధన్యవాదాలు అని' తలపొగరు ప్రదర్శించింది. గాంధీని హతమార్చిన తేదీ వేసి ట్వీట్ చేసింది.
వైరల్ .. చర్యలు ..
దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలైంది. దీనిని చూసిన నెటిజన్లు చౌదరి తీరుపై దుమ్మెత్తిపోశారు. అధికారిగా మీ తీరు సరిగా లేదని మండిపడ్డారు. నెటిజన్లతోపాటు రాజకీయ నాయకులు కూడా చౌదరి తీరును తప్పుపట్టారు. చౌదరి చర్యను తప్పుపట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. ఆమెను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. జాతి పితను అధికారి అవమానించారు. అంతేకాదు గాడ్సేకు థాంక్స్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు ఆ పార్టీ నేత జితేంద్ర అహ్లాద్. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టంచేశారు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా స్పందించారని తెలిపారు. చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖరాసినట్టు వివరించారు.
బదిలీ వేటు ..
గాంధీపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చౌదరిపై మహారాష్ట్ర సర్కార్ బదిలీ వేటువేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై జాయింట్ మున్సిపల్ కమిషనర్ నుంచి .. బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, వాటర్ అండ్ శానిటేషన్కు బదిలీ చేసింది. గాంధీపై చౌదరి చేసిన ట్వీట్ ను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి .. చర్యలు తీసుకుంది.
అబ్బే అలా కాదు ..
గాంధీపై తాను చేసిన ట్వీట్ ఇంటా, బయట విమర్శలు రావడంతో చౌదరి స్పందించారు. తాను గాంధీని అవమానించేట్లు ట్వీట్ చేయలేదని కొత్త భాష్యం చెప్పారు. మే11న చేసిన ట్వీట్ ను తొలగించానని పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. 2011 నుంచి తన టైమ్ లైన్ ను చూసినవారు మాత్రం తప్పుగా అర్థం చేసుకోరని .. తాను చేసింది కరెక్ట్ అనేలా సర్దిచెప్పుకున్నారు. ఇప్పుడే కాదు .. కలలో కూడా గాంధీని అవమానించబోమని చెప్పారు. గాంధీ అంటే అభిమానమని .. విగ్రహాం ముందు చాలాసార్లు వినమ్రతతో నమస్కారం చేశానని గుర్తుచేశారు. తన చివరి శ్వాస వరకు గాంధీని అభిమానిస్తానని పేర్కొన్నారు.