కారణమిదే: ఉద్యోగం వదిలేసి జైన మతాన్ని స్వీకరించిన టెక్కీ
ముంబై: మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి జైన మతాన్ని స్వీకరించేందుకు సంకేత్ ఫరేఖ్ అనే యువకుడు నిర్ణయం తీసుకొన్నాడు. పీజీ చేయాలని మొన్నటి వరకు భావించిన పరేఖ్ జైన మతాన్ని స్వీకరించేందుకు ముహుర్తాన్ని నిర్ణయించుకొన్నాడు.
ఐఐటీ ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన సంకేత్ ఫరేఖ్ అత్యధిక వేతనం ఇచ్చే ఉద్యోగంలో చేరారు. అంతేకాదు అమెరికాలో పీజీ కోర్సు చేయాలని సంకేత్ ఆశించాడు.కానీ, ఒక్కసారిగా సంకేత్ తన నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. తన సీనియర్తో చేసిన ఆన్లైన్ చాట్తో సంకేత్ తన నిర్ణయాన్ని మార్చుకొన్నాడు.
సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది.వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్ ఐఐటీలో తన సీనియర్, 2013లో దీక్ష తీసుకున్న భవిక్ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు.
ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని , అందుకే జైన మతాన్ని స్వీకరించనున్నట్టు ఆయన ప్రకటించారు.
తాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచీ సీనియర్ భవిక్తో చాట్ చేస్తుండేవాడినని తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు శరీరం చుట్టూ తిరిగేవని ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పాయని ఆయన చెప్పారు.