మహిళా ఖైదీ మర్మాంగంలో లాఠీ దూర్చి చిత్రహింసలు.. ముంబైలో ఘోరం..
బ్యారక్ లోకి వెళ్లాక.. మంజుల చేత బలవంతంగా దుస్తులు విప్పించి.. ఆమెను నగ్నంగా మార్చి.. మర్మాంగంలోకి లాఠీని దూర్చి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. నొప్పితో ఆమె ఎంత అరిచినా..
ముంబై: అల్పాహారం తక్కువగా పెట్టారని ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళా ఖైదీ పట్ల జైలు అధికారిణులు విచక్షణారహితంగా వ్యవహరించారు. ఆమె మర్మాంగంలోకి లాఠీని జొప్పించి మరీ ఆమెను హింసించారు. జైలర్ల చిత్రవధతో తీవ్ర రక్త స్రావమైన ఆ ఖైదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ముంబై బైకుల్లా జైల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మంజులా షెత్యే(38) అనే సత్ప్రవర్తన కలిగిన ఖైదీని జైలు అధికారిణులే అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని తోటి ఖైదీలు ఆరోపిస్తున్నారు. మంజుల అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇందులో భాగంగా ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంజుల అనే ఖైదీ తన సత్ప్రవర్తన కారణంగా బ్యారక్ వార్డెన్ గా గుర్తింపు పొందింది. ఈ నెల 23న ఉదయం 9గం.కు రోజూ లాగే జైలు సిబ్బంది పెట్టిన అల్పాహారాన్ని తెచ్చుకుంది. అయితే అందులో రెండు కోడి గుడ్లు, ఐదు బ్రెడ్ ముక్కలు తక్కువగా రావడంతో.. జైలు అధికారిణి మనీషా పోఖర్ కర్కు ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై మనీషా మంజులను తన ప్రైవేటు గదికి పిలిపించుకుంది.
గదిలో మనీషా ఏం చేసిందో ఏమో తెలియదు గానీ.. పెద్దగా అరుస్తూ.. నొప్పితో విలవిల్లాడుతూ మంజుల ఆమె గది నుంచి బయటకు వచ్చింది. నొప్పిని భరిస్తూనే ఆమె తన బ్యారక్ వద్దకు వచ్చిందని, ఆ తర్వాత బిందు నాయ్ కడే, వసీమా షైక్, షీతల్ షెగావంకర్, సురేఖ గుల్వే, ఆర్తీ షింగ్నే అనే ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు మంజుల బ్యారక్ లోకి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బ్యారక్ లోకి వెళ్లాక.. మంజుల చేత బలవంతంగా దుస్తులు విప్పించి.. ఆమెను నగ్నంగా మార్చి.. మర్మాంగంలోకి లాఠీని దూర్చి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. నొప్పితో ఆమె ఎంత అరిచినా.. వారు మాత్రం తమ పైశాచికత్వాన్ని వీడలేదన్నారు. తీవ్ర రక్తస్రావమైన మంజులకు ఎలాంటి వైద్య సహాయం అందలేదన్నారు. ఇదే క్రమంలో ఆమె బాత్రూమ్ లో స్పృహ తప్పి పడిపోవడంతో..మొదట రెసిడెంట్ డాక్టర్ వద్దకు, తర్వాత జేజే ఆసుపత్రికి తరలించారని సాక్షులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంజుల మరణించింది. మంజుల మరణంతో ఆగ్రహించిన తోటి ఖైదీలు జైలు అధికారులపై తిరగబడ్డారు. దీంతో జైల్లో ఆందోళనలు, దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీపై కూడా కేసు నమోదవడం గమనార్హం. ఆమె కూడా ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.