రీసెర్చ్: 2050 నాటికి ముంబై, కోల్కతాలో వరద బీభత్సం.. మూడున్నర కోట్ల మందిపై ఎఫెక్ట్
కార్బన ఉద్గారాలు, కాలుష్య కారకాలతో మానవాళికి పెను ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని పర్యావరణ వేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. వాహనాల వినియోగం తగ్గించాలని, ఏసీలు తక్కువగా వాడాలని కూడా కోరుతున్నారు. కానీ నాగరికత పేరుతో మేధావుల సూచనలను యువత పెడచెవిన పెట్టింది. దీని ఫలితమే వాతావరణ మార్పులకు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇదీ విషయం
అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ కఠోర సత్యాన్ని తెలిపింది. 2050 భారత్లో భారీగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ముంబై, కోల్కతాపై ప్రభావం చూపిస్తోందని వెల్లడించింది. ముంబై, నవీ ముంబై, కోల్కతాలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని తెలిపింది. వీరి సంఖ్య 50 లక్షలు ఉంటాయని తొలుత ఓ పరిశోధన సంస్థ తెలుపగా.. ఇప్పుడది మూడున్నర కోట్లకు చేరిందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
ముప్పు తప్పదు
కార్బన ఉద్గారాలను నియంత్రించకుంటే ముంబై, కోల్కతా చాలా మట్టుకు మునిగిపోతుందని హెచ్చరించింది. క్లైమెట్ సెంట్రల్ స్టడీ ఓ జర్నల్లో ఇండియాలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. పర్యావరణ, సముద్రతీరంలో వరదలకు సంబంధించి నాసాకు చెందిన ‘షటల్ రాడార్ టోపోగ్రాపిటిషన్'కూడా పాలుపంచుకుంది. ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై ఎస్ఆర్టీఎం పరిశోధిస్తోంది.
చెట్లను నరకొద్దు
పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మొక్కలను పెంచాలని.. ఉన్న చెట్లను నరికివేయొద్దని సూచిస్తోంది. లేదంటే పెనుముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి 300 మిలియన్ల ప్రజలు వరదలతో నిలువనీడ లేకుండా పోతారని పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో 150 మిలియన్ ప్రజలు ఆసియా ఖండంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న సముద్రమట్టం
కాలుష్యకారకాలతో సముద్రం కలుషితమవుతోంది. దీంతో సముద్రమట్టం పెరిగిపోతోంది. సముద్ర తీరప్రాంతాల్లో దాదాపు 640 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. కానీ 2100 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 340 మిలియన్లకు పడిపోతుందనే కఠోర వాస్తవాన్ని తెలియజేసింది. ఆసియా ఖండంలో ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. బంగ్లాదేశ్, చైనా కూడా జాబితాలో ఉన్నాయి. ఆ దేశాలు వరసగా 93, 42 మిలియన్లతో ఉన్నాయి. అక్కడి ప్రజలు వరదలతో ఇబ్బందిపడతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.