పోస్టుమార్టంకు తీసుకెళ్తే.. శ్వాస తీసుకున్నాడు
ముంబై: ఓసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అయితే మహారాష్ట్రలో మాత్రం అలా జరిగింది. ఓ వ్యక్తిని చనిపోయాడని నిర్ధారించుకున్న వైద్యులు.. రిపోర్టు తయారుచేసి పోస్టుమార్టంకు పంపించారు.
అయితే, చనిపోయిన వ్యక్తి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సులోచన శెట్టి మార్గ్లోని ఎస్టీ బస్టాప్ వద్ద ఓ వ్యక్తి(45) అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం 11.15 గంటలకు చోటు చేసుకుంది.
అతడ్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న లోకమాన్య తిలక్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి, చనిపోయాడని నిర్ధారించారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది నివేదిక కూడా తయారు చేసింది. ఇక పోస్టుమార్టం గదికి అతడ్నితరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.
గమనించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది వైద్యులకు, పోలీసులకు తెలియజేసింది. దీంతో ఆ వ్యక్తిని పోస్టుమార్టమ్కు తరలించకుండా ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. చెవికి ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆ వ్యక్తికి సరైన పోషకాహారం కూడా లభించడం లేదని, అందుకే బలహీనంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.
అయితే మొదట చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు, తాము చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కాగా, ‘ప్రభుత్వ వైద్యులు ఎంతటి నిర్లక్ష్యంతో ఉంటారో ఈ ఘటనే ఉదాహరణ' అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.