మోడల్ అరెస్టు: విమానం ఎక్కే ముందు బాంబు అంటూ అరిచి...
విమానంలో బాంబు ఉందంటూ వేసిన జోక్ పేలకపోగా, ఆ జోక్ ఎదురు తిరిగింది. దీంతో ఓ మోడల్ అరెస్టుకు దారి తీసింది.
ముంబై: జోక్ చేయబోయిన ఓ ముంబై మోడల్ కష్టాలను కొని తెచ్చుకుంది. ఆమె జోక్ పేలకపోగా, అది ఆమె అరెస్టుకు దారి తీసింది. విమానంలో బాంబు ఉందంటూ ఎక్కే ముందు ముంబైకి చెందిన 27 ఏళ్ల ఓ మోడల్ కలకలం సృష్టించింది. గురువారం రాత్రి సహార్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ 2 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే, తాను చేసిన బెదిరింపు ఉట్టిదేనని ఆమె అంగీకరించింది. అయినా ఆమెను పోలీసులు వదిలిపెట్టలేదు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసునమోదు చేశారు. రాత్రి 9 గంటలకు విమానం బయల్దేరుతుందనే సమయంలో ముంబై మోడల్ కాంచన్ ఠాగూర్ తన స్నేహితురాలి బ్యాగులో బాంబు ఉందనీ జాగ్రత్తగా తనిఖీ చేయాలని సెక్యురిటీ గార్డులకు చెప్పింది.
దీంతో విమానంలో ఒక్కసారిగా ఆందోళన చోటు చేుకుంది. సిబ్బంది ఆ సమాచారాన్ని వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులకు అందించారు. విమానాన్ని ఆపి ఆమెను, ఆమె ముగ్గురు స్నేహితురాళ్లను కిందికి దించేశారు. అయితే బాంబు మాట ఒట్టిదేననీ తాను సరదాగా అలా అన్నాననీ ఆ మోడల్ అధికారులతో వాగ్యుద్ధానికి దిగింది.
అయినా గంటపాటు తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత కాంచన్, ఆమె మిత్రబృందం లేకుండానే ఢిల్లీ విమానాన్ని పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. నిజంగా ఉగ్రవాదులు విమానం ఎక్కినా పట్టుకోలేరు గానీ జోక్ చేసినందుకు మాత్రం ఇంత చేస్తారా అంటూ ఆమె నిలదీసింది.
పుకార్లు సృష్టించి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసినవారికి ఇది తప్పదని అధికారులు అంటున్నారు. కాంచన్ను అరెస్టు చేసి ఐపీసీ 505(1)(బి) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది.
విచారణ పూర్తయ్యే వరకు ఆమెతో పాటు ఆమె మిత్రులు ముంబై నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. మోడల్ స్నిహితురాళ్లలో ఒకరి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో మిగతా వారంతా ఆమెకు తోడుగా ఢిల్లీ వెళ్లేందుకు బయల్దేరారు.