ఎన్సీపీకి షాక్.. పార్టీని వీడిన ముంబై చీఫ్, శివసేనలో చేరిక
ముంబై : మహారాష్ట్ర ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి షాక్ తగలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ముంబై ఎన్సీపీ చీఫ్ సచిన్ అహిర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్సీపీని వీడి శివసేనలో చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే ఆధ్వర్యంలో శివసేన కండువా కప్పుకొన్నారు. తన సేవలు శివసేనకు అవసరమున్నాయని భావించే పార్టీలో చేరుతున్నానని పేర్కొన్నారు. పార్టీని వీడుతున్న సందర్భంగా ఎన్సీపీ, శరద్ పవార్పై ఇసుమంత కామెంట్ చేయలేదు సచిన్.
ఎన్నికల వేళ ..
మరో రెండునెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీలు తమ బలబలాలు, అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. అంతేకాదు గ్రామీణ, పట్టణాల్లో బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ కీలక నేత సచిన్ అహిర్ శివసేనలో చేరారు. ఉద్దవ్, ఆదిత్య ఠాక్రే ఆధ్వర్యంలో ఆయన శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ముంబై ఎన్సీపీ చీఫ్గా వ్యవహరిస్తోన్న సచిన్ రాజీనామా ఆ పార్టీకి పెద్ద లోటుగానే భావించాలి. దీంతో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్సీపీ చేమటోడ్చాల్సి వస్తోంది.
పవార్ సన్నిహితుడు ..
సచిన్ అహిర్ .. ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్కు చాలా దగ్గర. 1999లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్సీపీలో ఉన్నారు. శివ్డీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2014లో వర్లి నుంచి పోటీ చేసి శివసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. శివసేనలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడారు సచిన్. గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు సచిన్.
ఎందుకు చేరుతున్నానంటే ..
తనకు ఎన్సీపీ ఎలాంటి ద్వేషం లేదనిప పేర్కొన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని వివరించారు. కొద్దిరోజుల క్రితం తాను ఓ సామాజిక కార్యక్రమంలో ఆదిత్య ఠాక్రేను కలిసినట్టు తెలిపారు. మాటల్లో భాగంగా శివసేన మీ లాంటి నేత కోసం అన్వేషిస్తుందని ఠాక్రే చెప్పారని గుర్తుచేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పట్టున్న నేతకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో చర్చలు జరిపి పార్టీలో చేరినట్టు వివరించారు. మహారాష్ట్రలో దాదాపు ఎక్కువశాతం మున్సిపల్ కార్పొరేషన్లను శివసేను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వారు కోరండంతో అంగీకరించానని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో తనకున్న నైపుణ్యాన్ని శివసేన పార్టీ కోసం ఉపయోగిస్తానని సచిన్ వెల్లడించారు. దీంతోపాటు తాను వర్లి నుంచి ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టంచేశారు.